శబరిమల అంశంలో యూటర్న్ తీసుకున్న రాహుల్ గాంధీ, ఆ దెబ్బకేనా?
దుబాయ్/న్యూఢిల్లీ: శబరిమల అయ్యప్ప స్వామి అంశంపై ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ యూటర్న్ తీసుకున్నారు. గతంలో మహిళల ప్రవేశాన్ని ఆయన స్వాగతించారు. తాజాగా, రెండు రోజుల దుబాయ్ పర్యటనలో ఉన్న ఆయన మరోలా స్పందించారు. సంప్రదాయ నిషేధాన్ని కొనసాగించేలా ప్రజల వద్ద ఆమోదించదగ్గ కారణాలే ఉన్నాయన్నారు.
శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశం విషయంలో ఇరువర్గాల వాదనలు తాను పరిశీలించానని చెప్పారు. వారు ఆలయంలోకి ప్రవేశించాలా వద్దా అనేది తాను చెప్పనని అన్నారు. ఈ విషయాన్ని తాను ప్రజలకే వదిలేస్తున్నాని అన్నారు.
ఏపిలో పొత్తు పై తేల్చేసిన అధినేతలు..చంద్రబాబు చెప్పింది ఇదే: రాహుల్ లక్ష్యం అదే..!
తమను ఆలయంలోకి రానీయాలన్ని వివాదాస్పద మహిళల వాదన, అలాగే, ఆలయంలోకి పదేళ్ల నుంచి యాభయ్యేళ్ల మహిళలు వద్దనే వారి వాదన న్యాయబద్దంగానే ఉందని చెబుతూ ఇరువురి వాదనను ఆయన సమర్థించారు. కాగా, సుప్రీం కోర్టు తీర్పు మేరకు అన్ని వయసుల మహిళలను ఆలయంలోకి అనుమతించాలని తొలుత రాహుల్ కేరళ ప్రభుత్వానికి మద్దతిచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న బీజేపీ సహా ఇతర హిందుత్వ సంస్థల వాదనలను ఖండించారు. కానీ, ఆలయంలోకి ఎంట్రీపై మహిళలతో సహా భక్తులు, హిందుత్వ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆయన యూటర్న్ తీసుకున్నారు. అలాగే, రానున్న లోకసభ ఎన్నికల్లో నష్టం జరగకుండా ఉండేందుకు ఈ విధంగా మాట్లాడి ఉంటారని భావిస్తున్నారు.
రాఫెల్ ఒప్పందంపై రాహుల్
రాఫేల్ ఒప్పందంపై విమర్శలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమర్థించుకున్నారు. సీతారామన్ స్థానంలో ఎవరు ఉన్నా ఇలాంటి వ్యాఖ్యలే చేసేవాడినని చెప్పారు. సీతారామన్కు బదులుగా రాపేల్ అగ్రిమెంట్ పేపర్లను ప్రధాని మోడీ పార్లమెంటులో సమర్పించాలన్నారు.
ప్రధాని మోడీ ఈ ఒప్పందం ద్వారా అనిల్ అంబాని రూ.30వేల కోట్లు దోచుకునేందుకు సహకరించారని ఆరోపించారు. పార్లమెంటులో ఇతరులతో మాట్లాడించకుండా ప్రధాని రఫేల్ అంశంపై మాట్లాడాలన్నారు. సీతారామన్ స్థానంలో మరో వ్యక్తి ఉన్నా తాను ఇలాంటి వ్యాఖ్యలే చేసేవాడినని, అసలు విషయాన్ని పక్కదోవ పట్టిస్తున్నారన్నారు.
రాజస్థాన్లో ర్యాలీ సందర్భంగా రాహుల్ గాంధీ మహిళలను అవమానించేలా మాట్లాడారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. 56 అంగుళాల ఛాతి ఉన్న వ్యక్తి (మోడీ) ఓ మహిళ వద్దకు వెళ్లి తనను రక్షించమని కోరారని రాహుల్ అప్పుడు అన్నారు. ఆ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. తొలిసారి భారత పుత్రిక రక్షణ మంత్రి అయ్యారని, ఆమె పార్లమెంటులో రాఫెల్ ఒప్పందంపై విపక్షాల నోర్లు మూయించారని, కానీ విపక్షాలు మాత్రం మహిళా శక్తిని అవమానించాయని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీకి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది.