శబరిమల ఖజానా ఖాళీ: 39 రోజుల్లో నామమాత్రంగా ఆదాయం: రూ.156 కోట్ల నుంచి మహా పతనం
తిరువనంతపురం: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులు శబరిమల ఆలయంపై పెను ప్రభావాన్ని చూపాయి. ఆలయ ఆదాయానికి భారీగా గండి కొట్టాయి. మణికంఠుడి ఆలయానికి మనీ ప్రాబ్లమ్ను తీసుకొచ్చాయి. కోట్లాది రూపాయల ఆదాయాన్ని చవి చూడాల్సిన ట్రావెన్కూర్ దేవస్వొం బోర్డు..జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో పడటానికి కరోనా వైరస్ పరిస్థితులు కారణం అయ్యాయి. మకర జ్యోతి నాటికీ దాదాపుగా ఇవే తరహా వాతావరణం కొనసాగే అవకాశాలు లేకపోలేదు.
కేరళ పత్తనంథిట్ట జిల్లాలోని దట్టమైన శబరిగిరుల్లో వెలిసిన అయ్యప్పస్వామిని దర్శించడానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు తరలివెళ్తుంటారు. మాలను ధరించి.. అయ్యప్పుడి నామాన్ని జపిస్తూ భక్తులు శబరిమలకు బయలుదేరుతుంటారు. మండలం-మకరవిళక్కు సీజన్లో 40 రోజుల పాటు అయ్యప్ప స్వామిని దర్శించడానికి బారులు తీరుతుంటారు. ఈ సారి అలాంటి పరిస్థితులు లేవు. కరోనా వైరస్ మహమ్మారి విస్తరించిన కారణంగా.. పరిమిత సంఖ్యలో భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించింది ట్రావెన్కూర్ దేవస్వొం బోర్డు.
ప్రారంభంలో రోజూ వెయ్యిమందిని, శని, ఆదివారాల్లో రెండువేల మంది భక్తులు అయ్యప్పస్వామిని దర్శించడానికి అనుమతి ఇచ్చారు. అనంతరం దీన్ని పునఃసమీక్షించారు. భక్తుల సంఖ్యను కొద్దిగా పెంచారు. ఈ సారి భక్తుల సంఖ్య భారీగా తగ్గిన ప్రభావం.. శబరిమల ఆలయ ఆదాయంపై పడింది. రోజూ కనీసం కోటి రూపాయల మేర ఆదాయాన్ని చవి చూసే దేవస్వొం బోర్డు ఖజానా.. కరోనా కారణంగా ఖాళీ అయ్యే పరిస్థితికి చేరుకుంది.
మండలం-మకరవిళక్కు సీజన్లో ఆలయానికి అందిన ఆదాయం 9 కోట్ల 9 లక్షల రూపాయలు. ఆలయానికి హుండీ రూపంలో వచ్చిన ఆదాయం, టికెట్లు స్వామివారి అప్పం, అరవణ విక్రయాల ద్వారా 39 రోజుల్లో 9,09,14,893 ఆదాయం వచ్చినట్లు దేవస్వొం బోర్డు వెల్లడించింది. కిందటి నెల 16 నుంచి ఈ నెల 24వ తేదీ వరకు వచ్చిన ఈ మేర రాబడి నమోదైనట్లు తెలిపింది. గత ఏడాది ఇదే సమయానికి 156,60,19,661 రూపాయల ఆదాయం వచ్చింది. ఈ సంఖ్య ప్రస్తుతం తొమ్మిది కోట్లకు క్షీణించినట్లు దేవస్వొం బోర్డు వివరించింది. ఈ సీజన్లో స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 71,706 మాత్రమే.