శబరిమల రివ్యూ పిటిషన్: నాడు కేసులో ఒక్కో జడ్జీ ఎలాంటి తీర్పు ఇచ్చారు..?
న్యూఢిల్లీ: మరి కొద్ది గంటల్లో సుప్రీం కోర్టు మరో కీలక తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే అయోధ్య, సీజేఐ కార్యాలయం ఆర్టీఐ పరిధి కేసుల్లో కీలక తీర్పు ఇచ్చిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ గురువారం శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటిషన్లో తీర్పు ఇవ్వనున్నారు. అయితే ఈ కేసు పూర్వాపరాలు, అసలు తీర్పుపై నాటి సీజేఐ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఎలాంటి తీర్పు ఇచ్చారు. ఇందులో ఉన్న జడ్జీల బృందం ఎలాంటి తీర్పు ఇచ్చారో ఒకసారి చూద్దాం.
శబరిమల, రాఫెల్, అయోధ్య..ఒకదాన్ని మించి ఒకటి: నెలరోజుల్లో కీలక తీర్పులు
అప్పటి జడ్జీలు ఎలాంటి తీర్పు ఇచ్చారు..?
అయోధ్య తీర్పు తర్వాత మళ్లీ మతపరమైన కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇవ్వనుంది. శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలకు ప్రవేశం కల్పించవచ్చు అన్న తీర్పును గతేడాది అప్పటి చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యలు ధర్మాసనం వెల్లడించింది. అయితే సుప్రీంకోర్టు తీర్పును సవాలు చేస్తూ రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. దీన్ని విచారణ చేసింది ప్రస్తుత చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం. ఇక దీనిపై గురువారం తీర్పు ఇవ్వనుంది. ఈకేసులో నాటి జడ్జీలు ఈ విధంగా తీర్పు ఇచ్చారు. ఇక ఆ ధర్మాసనంలో సభ్యులుగా జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఖన్విల్కర్, జస్టిస్ నారిమాన్, జస్టిస్ డీవై చంద్రచూడ్ జస్టిస్ ఇందూ మల్హోత్రాలు ఉన్నారు.
జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఖన్విల్కర్ల తీర్పు
భక్తికి ఆడ మగ అనే తేడా లేదని జస్టిస్ దీపక్ మిశ్రా జస్టిస్ ఖన్విల్కర్లు చెప్పారు. ఎవరి విశ్వాసం వారికి ఉంటుందని భగవంతుడి విషయంలో అనాదిగా వస్తున్న సంప్రదాయాల పేరుతో మహిళలను అనుమతించకపోవడం సరికాదని అభిప్రాయపడింది. అయ్యప్ప భక్తులు కేవలం పురుషులు మాత్రమే ఉండాలని ఎక్కడా లేదని వెల్లడించారు. మహిళలను తక్కువగా చూడం సబబు కాదని అభిప్రాయపడిన ఇద్దరు జడ్జీలు... ఈదేశంలో మహిళలను దేవతలుగా పూజిస్తారని గుర్తుచేశారు. ఇక రుతుక్రమం పేరుతో భగవంతుడిని దర్శనం చేసుకోకుండా అడ్డుకోవడమంటే రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని చెప్పారు. ఓ వయస్సున్న మహిళలను ఆలయంలోకి అనుమతించకూడదని ఏ మతం చెప్పలేదని గుర్తుచేశారు. అది సమగ్రతను కూడా దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డారు. ఇక కేరళ ఆలయ ప్రవేశ చట్టంలోని 3(బీ) సెక్షన్ మహిళలు భగవంతుడిని పూజించే స్వేచ్ఛను హరించేలా ఉందని అభిప్రాయపడ్డారు. భగవంతుడి ముందు మహిళలు పురుషులు సమానమే అని గుర్తు చేశారు.
జస్టిస్ నారిమాన్ ఇచ్చిన తీర్పు
అయ్యప్ప స్వామి భక్తులు ప్రత్యేకం కాదు. హిందువులు చేపట్టే పూజల్లో వారు భాగం మాత్రమే అని చెప్పారు జస్టిస్ నారిమాన్. అయ్యప్ప స్వామి ముందు అన్ని వయస్సుల మహిళా భక్తులు సమానమే అని పేర్కొన్న జస్టిస్ నారిమాన్ స్త్రీ పురుషుల మధ్య అంతరం సృష్టించి మహిళలకు ఆలయంలోకి ప్రవేశ కల్పించకపోవడం సబబు కాదని చెప్పారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంను అడ్డుకుంటున్నారంటే అది రాజ్యాంగంలోని ఆర్టికల్ 26ను ఉల్లంఘిస్తున్నట్లే అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు మహిళలకు పురుషులతో సమానంగా భగవంతుడిని పూజించేందుకు సర్వహక్కులు ఉన్నాయని వెల్లడించారు.
జస్టిస్ డీవై చంద్రచూడ్ తీర్పు
మహిళలు దేవుని దృష్టిలో తక్కువ అని చేసి చూపడం రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని జస్టిస్ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ఇక మహిళల శరీరంలో చోటుచేసుకుంటున్న బయాలాజికల్ మార్పులను చూపించి వారికి ఆలయంలోకి ప్రవేశం కల్పించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. మహిళలను దేవుడి దృష్టిలో తక్కువగా చేసిన చూపడం భావ్యం కాదని చెప్పారు. ఇక రుతుక్రమం అనేది చూపి మహిళలకు ఆలయంలోకి ప్రవేశం కల్పించకపోవడం దారుణమైన విషయమని చెప్పారు. మతపరమైన ఆచారాల ముందు మహిళలను తక్కువగా చేసి చూపిస్తే అందుకు కోర్టు అంగీకరించబోదని చెప్పారు.
జస్టిస్ ఇందు మల్హోత్రా తీర్పు
ధర్మాసనంలోని నలుగురు జడ్జీలు ఒక రకమైన తీర్పు చెబితే జస్టిస్ ఇందు మల్హోత్ర మాత్రం మరోలా చెప్పారు. మతంతో విశ్వాసంతో ముడిపడిన అంశాలను చాలా జాగ్రత్తతో వ్యవహరించాలని జస్టిస్ ఇందూ మల్హోత్ర చెప్పారు. దేశంలో లౌకికత్వాన్ని పరిరక్షించేందుకు మతపరమైన అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలని ఆమె పేర్కొన్నారు. సమానహక్కులు, ఇష్టదైవాన్ని పూజించడం రెండు ప్రాథమిక హక్కులే అని గుర్తుచేశారు. భారతదేశంలో వివిధ రకాల మతాచారాలు ఉన్నాయని అదే సమయంలో ఎవరికి ఇష్టమైన దైవాన్ని వారు పూజించుకునే హక్కు ఉందని చెప్పిన జస్టిస్ ఇందూ మల్హోత్రా.. కొన్ని మతపరమైన అంశాల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదని అభిప్రాయపడ్డారు.
ఒక్క శబరిమలకే వర్తించదని చెప్పిన జస్టిస్ ఇందు మల్హోత్ర
ఇది ఒక్క శబరిమలకు మాత్రమే వర్తించదని ఇతర మతాలు వాటి ఆచారాల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదని వెల్లడించారు. ఒక మతం ఎలాంటి ఆచారాలను మొదటి నుంచి పాటిస్తుందో అలాంటి ఆచారాలే పాటించాలని ఆమె చెప్పారు. అదే సమయంలో కొన్ని శతాబ్దాలుగా వస్తున్న ఆచారం ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉన్నాయని చెప్పడం జడ్జీలకు కూడా తగదని ఆమె అభిప్రాయపడ్డారు. జడ్జీల వ్యక్తిగత అభిప్రాయాలు ఇక్కడ చెల్లవని ఎందుకంటే ఎలాంటి లాజిక్కులు లేకపోయినప్పటికీ ఒక మతంను విశ్వసించి, పూజలు నిర్వహించే స్వేచ్ఛ ఒక వ్యక్తికి ఉందని ఆమె చెప్పారు.