పెండింగ్లో శబరిమల తీర్పు: ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం పరిశీలనకు: బెంచ్లో భేదాభిప్రాయాలు
Recommended Video
న్యూఢిల్లీ: చారిత్రాత్మకమైన, ప్రతిష్ఠాత్మకమైన శబరిమల ఆలయంలో అన్ని వయస్సుల మహిళలకు ప్రవేశాన్ని కల్పించడానికి ఉద్దేశించిన రివ్యూ పిటీషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం తన తుది తీర్పును పెండింగ్ లో ఉంచింది. దీనిపై మరింత విస్తృత పరిశీలన అవసరమని అయిదుమంది న్యాయమూర్తుల ధర్మాసనం అభిప్రాయ పడింది. ఈ కేసును ఏడుమంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం పరిశీలనకు పంపించింది. గురువారం ఉదయం దీనిపై తుది తీర్పు వెలువడాల్సి ఉన్నప్పటికీ.. అయిదుమంది న్యాయమూర్తుల ధర్మాసనంలో భేదాభిప్రాయాలు తలెత్తాయి.
శబరిమల రివ్యూ పిటిషన్: నాడు కేసులో ఒక్కో జడ్జీ ఎలాంటి తీర్పు ఇచ్చారు..?
3: 2 మెజారిటీతో
శబరిమల ఆలయంలో మహిళలకు ప్రవేశం కల్పించడానికి అనుమతి ఇచ్చే విషయంలో అయిదుంది న్యాయమూర్తులు ఉన్న ధర్మాసనంలో భేదాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మహిళలకు ప్రవేశాన్ని నిషేధించడానికి ముగ్గురు న్యాయమూర్తులు సమర్థించారు. మరో ఇద్దరు దీన్ని తిరస్కరించారు.
విస్తృత ధర్మాసనానికి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్, ఖన్విల్కర్, ఇందు మల్హోత్రా మహిళల ప్రవేశానికి నిషేధించడానికి అనుకూలంగా ఉండగా.. జస్టిస్ నారీమన్, జస్టిస్ డీవై చంద్రచూడ్ వారికి ప్రవేశం కల్పించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ తీర్పును పెండింగ్ లో ఉంచారు. ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం పున: సమీక్షించాలని సుప్రీం నిర్ణయం తీసుకొన్నది.
మహిళలకు ప్రవేశాన్ని కల్పించడాన్ని వ్యతిరేకిస్తోన్న హిందువులు..
హైందవ ఆచార, వ్యవహారాల ప్రకారం.. శబరిగిరుల్లో వెలిసిన మణికంఠుడిని మహిళలు దర్శించుకోవడం నిషేధం. పదేళ్ల బాలికల నుంచి 50 సంవత్సరాల మహిళలు స్వామివారిని దర్శించకూడదని పురాణాలు చెబుతున్నాయి. దీన్ని సవాలు చేస్తూ భూమాత బ్రిగేడ్ సామాజిక ఉద్యమకారణి తృప్తి దేశాయ్ గత ఏడాది దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
మహిళలకు ప్రవేశంపై కోర్టు గ్రీన్ సిగ్నల్
తృప్తిదేశాయ్ దాఖలు చేసిన పిటీషన్ పై అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్ర సారథ్యంలో జస్టిస్ రోహిన్టన్ నారిమన్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రాలతో కూడిన అయిదుమంది న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసుపై సానుకూలంగా తీర్పు ఇచ్చింది. పదేళ్లు నుంచి 50 సంవత్సరాల లోపు మహిళలు స్వామివారిని దర్శించుకోవచ్చని ఆదేశించింది. దాంతో ఈ అంశంపై రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి.