శబరిమల నిరసనలు: రాళ్లు రువ్వడంత ఒకరు మృతి.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించి స్వామివారి దర్శనం చేసుకోవడంపై కేరళ రాష్ట్రం మరోసారి భగ్గుమంది. బిందు అమ్మిని, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు బుధవారం తెల్లవారుజామున స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ వార్త బయటకు పొక్కడంతో కేరళలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో చంద్రన్ ఉన్నితన్ అనే వ్యక్తి తీవ్రగాయాలపాలయ్యాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
కేరళ మరోసారి దద్దరిల్లింది. ఇద్దరు మహిళలు స్వామివారి దర్శనం చేసుకున్నారనే వార్త బయటకు పొక్కగానే శబరిమల కర్మసమితి నిరసనలకు దిగింది. ఈ సమయంలోనే అక్కడ ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఓ వర్గంకు చెందిన వారు రాళ్లు రువ్వారు. దీంతో కర్మసమితి వర్గానికి చెందిన వ్యక్తి చంద్రన్ ఉన్నితన్కు తీవ్రగాయాలయ్యాయి. పతనంతిట్ట జిల్లాలోని పండలంలో చోటుచేసుకుంది ఈ ఘటన. గాయపడిన చంద్రన్ ఉన్నితన్ను తొలుత పండలంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమిస్తుండటంతో తిరువల్లలోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ చంద్రన్ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి సీపీఐఎం కార్యకర్తలు ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. కన్నన్, అంజులుగా వారిని గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని అరెస్టులు జరుగుతాయని పోలీసులు తెలిపారు.
కూరంబలకు చెందిన చంద్రన్ త్వరగా ఇంటికొస్తానని చెప్పి బుధవారం సాయంత్రం 4:30 గంటలకు వెళ్లినట్లు అతని భార్య విజయమ్మ చెప్పింది. రాళ్లు రువ్వాలని కార్యకర్తలకు పండలం సీపీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లినట్లు ఆరోపించారు. అంతేకాదు కమ్యూనిస్టు నేతలు పోలీసులకు మధ్య రహస్య ఒప్పందం జరిగిందనే అనుమానం ఆమె వ్యక్తం చేశారు. పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే తన భర్త మృతి చెందాడని విజయమ్మ కన్నీరుమున్నీరైంది.
ఘటనపై విచారణ జరపాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే పోలీసు అనుమతి లేకుండా పండలంలో నిరసన కార్యక్రమం చేపట్టారని ఖాకీలు చెప్పారు. పరిస్థితి చాలా సున్నితమని నిరసనలు చేపడితే ఒక యుద్ధవాతావరణమే నెలకొంటుందని పండలం సీఐ శబరిమల కర్మ సమితిని హెచ్చరించినట్లు చెప్పారు. పోలీసుల సూచనలను పాటించిఉంటే చంద్రన్ బతికుండేవాడని చెప్పారు.