Sabarimala: అయ్యప్పకు 453 సవర్ల బంగారు నగలతో అలంకరణ, భక్తులకు నో చాన్స్, మండల పూజ రోజు!
శబరిమల/ కొచ్చి/ పంపా: హిందువులు, ముఖ్యంగా శివుడు, అయ్యప్ప భక్తులు ఎంతో పవిత్రంగా పూజించే అయ్యప్పస్వామిని అలంకరించడానికి బంగారు నగలు శబరిమలకు తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 453 సవర్ల బంగారు నగలతో అయ్యప్పస్వామిని అలంకరిస్తున్నారు. డిసెంబర్ 26వ తేదీన జరగనున్న మండల పూజ రోజు అయ్యప్పస్వామిని సాంప్రధాయం ప్రకారం బంగారు నగలతో అలంకరించడానికి శబరిమల దేవస్వం బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయ్యప్పస్వామి సన్నిధానంకు బంగారు నగలు తీసుకెలుతున్న సందర్బంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
ప్రత్యేక వాహనంలో నగలు
ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో అరణ్ములలోని పార్థసారథి దేవాలయంలో ఉన్న అయ్యప్పస్వామి ఆభరణాలను డిసెంబర్ 22వ తేదీన ఊరేగింపుగా శబరిమలలోని అయ్యప్ప సన్నిధానానికి తీసుకెలుతున్నారు. భారీ బందోబస్తుతో ప్రతిఏడాది అటవి మార్గంలో అయ్యప్ప స్వామి ఆభరణాలను శబరిమలకు తీసుకెళ్లడం అనవాయితీగా జరుగుతుంది.
భక్తులకు నో చాన్స్
ప్రతి ఏడాది అయప్ప స్వామి ఆభరణాలను తీసుకెళ్లే వాహనానికి ఇరు వైపుల అయ్యప్పస్వామి భక్తులు నిలబడి స్వామియే శరణమయ్యప్ప అంటూ స్వామిని తలుచుకోవడం ఆనవాయితీగా వస్తుంటుంది. అయితే కోవిడ్ నియమాలు అమలులో ఉన్న సందర్బంగా ఈ ఏడాది అయ్యప్పస్వామి అభరణాలు తీసుకెళ్లే సమయంలో మార్గం ఇరు వైపుల అయ్యప్ప భక్తులు నిలబడటానికి అవకాశం లేకుండా అధికారులు ముందుగానే నిషేధం విధించారు.
ఒక్క అవకాశం కోసం
జీవితంలో ఒక్కసారైనా అయ్యప్పస్వామిని దర్శించుకోవాలని హిందువులు చాలా మంది దేవుడిని ప్రార్థిస్తుంటారు. నవంబర్ 15వ తేదీన కేరళలోని శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయంలో మండల పూజలు నిర్వహించారు. నవంబర్ 16వ తేదీ నుంచి అయ్యప్ప భక్తులు శబరిమలలోని సన్నిధానంలో అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి అయ్యప్ప భక్తులకు అవకాశం ఇచ్చారు.
పంపాలో అయ్యప్ప ఆభరణాల ప్రదర్శన
పుణ్య నది పంపాలోని గణపతి దేవాలయంలోని నండప్పండల్ మండపంలో అయ్యప్పస్వామి ఆభరణాలు ప్రదర్శనకు పెడుతారు. తరువాత డిసెంబర్ 22వ తేదీన ఊరేగింపుగా పంపా నుంచి శబరిమలకు దట్టమైన అటవి ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతతో అయ్యప్పస్వామి ఆభరణాలను తీసుకెలుతారు. ప్రతి ఏడాది కొన్ని వేల మంది ఆ రోజు అయ్యప్పస్వామి ఆభరణాలు తీసుకెళ్లే వాహనాన్ని చూసేవాళ్లు. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది అయ్యప్ప భక్తులకు ఆ అవకాశం లేకుండా పోయింది.
మండల పూజకు ఏర్పాట్లు
శబరిమలకు తీసుకెళ్లిన ఆభరణాలను 18 మెట్లు మీద నుంచి అయ్యప్ప సన్నిధానంలోకి తీసుకెలుతారు. డిసెంబర్ 25వ తేదీ సాయంత్రం 6. 30 గంటలకు అయ్యప్పస్వామిని ప్రత్యేక ఆభరణాలతో అలంకరిస్తారు. ఆరోజు రాత్రి అయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. డిసెంబర్ 26వ తేదీన మద్యాహ్నం 12 గంటలకు అయ్యప్పస్వామి సన్నిధానంలో మండలపూజలు చెయ్యడానికి అధికారులు ఇప్పటి నుంచి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కోవిడ్ నియమాల ప్రకారం రెండు వేల మంది మాత్రమే శబరిమలో అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి కేరళ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. శనివారం, ఆదివారం మాత్రం 3 వేల మంది అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి అవకాశం చిక్కింది.