తెరచుకున్న శబరిమల ఆలయం ... 250 మందికే అనుమతి .. కోవిడ్ నిబంధనలతోనే స్వామి దర్శనం
దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఆలయాలు మూత పడిన విషయం తెలిసిందే . కోవిడ్ లాక్డౌన్ కారణంగా ఏడు నెలల మూసివేత తరువాత కేరళలోని శబరిమల ఆలయాన్ని శనివారం ప్రజల కోసం తిరిగి తెరిచారు. ఐదు రోజుల నెలవారీ పూజ కోసం ఈ నెలలో ఆలయాన్ని తెరిచారు . ఆలయం తెరచుకున్న నేపధ్యంలో శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించాలనుకునే భక్తులు కరోనా నియమాలను పాటిస్తూ దర్శించుకోవాలని ట్రావెన్ కోర్ దేవస్థాన బోర్డు స్పష్టం చేసింది . ఫేస్ మాస్క్లు ధరించాలని , కరోనా నెగెటివ్ సర్టిఫికెట్లు తీసుకువచ్చిన వారికే దర్శనాలను అనుమతిస్తామని పేర్కొంది .
Recommended Video
శబరిమల యాత్ర నవంబర్ 16 నుండి.. వర్చువల్ క్యూ విధానం.. కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి
రోజుకు 250 మందికే అనుమతి .. వృద్ధులకు నో ఛాన్స్
ప్రతిరోజూ గరిష్టంగా 250 మందిని ఆలయం లోపల అనుమతిస్తారు. ఈ రోజు దర్శనం కోసం 246 మంది ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. అంతేకాదు 10 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల వారిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు . రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల మధ్య అయ్యప్ప స్వామిని దర్శించాలనుకునే వారు కఠినమైన ప్రోటోకాల్స్ పాటించాల్సిందే . కరోనా నెగిటివ్ రిపోర్ట్ ను తీసుకోని వారి కోసం నీలాకల్ బేస్ క్యాంప్ వద్ద రాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా నెగిటివ్ నిర్ధారణ అయితేనే దర్శనానికి అనుమతి ఇస్తారు .
పంబానదిలో మునగకుండా షవర్ లతో స్నానానికి ఏర్పాట్లు
COVID-19 ప్రోటోకాల్లకు కట్టుబడి ఉండగా, నెయ్యి అభిషేకం మరియు అన్నదానం వంటి ఆచారాలను నిర్వహించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు .పంబా నది వద్ద ఆచార స్నానం నిలిపివేయబడింది .భక్తులు స్నానం చేయడానికి ఎరుమెలీ మరియు పంబా వద్ద షవర్ వ్యవస్థలు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది . సన్నిధానం (ప్రధాన ఆలయ ప్రాంగణం) , బేస్ క్యాంప్స్ - పంబా లేదా నీలాకల్ లలో రాత్రిపూట బస చేయడానికి కూడా అనుమతి లేదు.
నేటి నుండి 5 రోజుల పాటు ఆలయ దర్శనాలు .. భక్తులకు కరోనా నియమాలు
కరోనా వ్యాప్తిని ప్రారంభ దశలో నియంత్రించినందుకు ప్రశంసలు పొందిన కేరళ, గత నెల నుండి మళ్ళీ భారీగా కరోనా కేసులను నమోదు చేస్తుంది . జనవరిలో మొదటి కేసు నమోదైనప్పటి నుండి రాష్ట్రంలో మూడు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. నేటి నుండి వచ్చే ఐదు రోజులలో రెగ్యులర్ గా పూజలు జరుగుతాయి. ఇక మండల , జ్యోతి దీక్షలకు సంబంధించి ఆలయ దర్శనాలు నవంబర్ 16 నుండి ప్రారంభం కానున్నాయి . కరోనా నేపధ్యంలో అయ్యప్పస్వామి మాల వేసుకుని, అత్యంత నిష్టతో పూజాధికాలు నిర్వహించి, ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి శబరిమలకి వెళ్లి స్వామిని దర్శించుకునే అయ్యప్ప భక్తులకు ఈసారి కోవిడ్ నిబంధనలు కూడా కచ్చితంగా పాటించాల్సిన పరిస్థితి .