మణికంఠుడి ఆలయానికి మనీ ప్రాబ్లం: జీతాలు ఇవ్వలేని స్థితి?: దారుణంగా దిగజారిన ఆదాయం
తిరువనంతపురం: పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించడంలో భాగంగా భక్తల రాకపై ఆంక్షలు విధించాల్సి రావడం వల్ల ఆలయ రోజువారీ రాబడి దారుణంగా పడిపోయింది. కోట్ల రూపాయల నుంచి లక్షలకు క్షీణించింది. ఫలితంగా- భక్తులకు సౌకర్యాలను కల్పించడానికి ఖర్చుతో కూడుకున్న ఎలాంటి నిర్ణయాన్ని కూడా ట్రావెన్కూర్ దేవస్వొం బోర్డు సత్వరంగా తీసుకోలేకపోతోంది. మున్ముందు ఉద్యోగులకు జీతాలను కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి.
Recommended Video
జంట తుఫాన్ల జల పడగ: పొంచివున్న పెను ముప్పు: నివార్, గతి: భారీ వర్షాలతో అల్ల కల్లోలమే
భక్తుల రాకపై ఆంక్షల వల్ల..
మండలం-మకరవిళక్కు సీజన్ రోజుల్లో శబరిమల ఆలయం కోట్ల రూపాయల ఆదాయన్ని ఆర్జిస్తుంది. హుండీ, తీర ప్రసాదాలు, టికెట్ల విక్రయాలు, ముడుపులు, మొక్కుబడుల ద్వారా ఈ సీజన్లో వచ్చే ఆదాయం వంద కోట్ల రూపాయల పైమాటే. తొలిరోజే లక్షమందికి పైగా భక్తులు అయ్యప్పస్వామిని దర్శించుకుంటుంటారు. సుదీర్ఘకాలం తరువాత ఆలయ తలుపులు తెరచుకున్న వెంటనే స్వామివారిని దర్శించడాన్ని మహద్భాగ్యంగా భావిస్తుంటారు. పెద్దమొత్తంలో కానుకలను సమర్పిస్తుంటారు. ఆ ఆదాయానికి అనుగుణంగా భక్తులకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తుంటుంది దేవస్వొం బోర్డు. ఈ సారి దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి.
మూడున్నర కోట్ల రూపాయల నుంచి..
భక్తుల రాకపై విధించిన ఆంక్షల ప్రభావం ఆలయానికి వచ్చే ఆదాయంపై పడింది. గత ఏడాది ఇదే సమయానికి ఒక్కరోజులో మూడున్నర నుంచి నాలుగు కోట్ల రూపాయల ఆదాయం సమకూరగా.. ఈ సారి ఆ సంఖ్య 10 లక్షలు కూడా ఉండట్లేదు. మండలం-మకరవిళక్కు సీజన్లో రోజువారీ ఆలయ ఆదాయం 10 లక్షల రూపాయలకు మించట్లేదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రోజూ వెయ్యి మంది భక్తులకు మాత్రమే అయ్యప్ప స్వామి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. శని, ఆదివారాల్లో మాత్రం ఈ సంఖ్యను రెట్టింపు చేశారు. మణికంఠుడిని దర్శించడానికి రెండువేల మందికి అనుమతి ఉంటుంది.
50 లక్షలు జీతాలకే..
ట్రావెన్కూర్ దేవస్వొం బోర్డు పరిధిలో పనిచేసే ఉద్యోగుల వేతనాల కోసం ప్రతినెలా 50 లక్షల రూపాయలకు పైగా మొత్తాన్ని వ్యయం అవుతుంటుంది. ఇతరత్రా అలవెన్సులు దీనికి అదనం. కరోనా వల్ల భక్తుల సంఖ్య తగ్గడం, దానికి అనుగుణంగా ఆదాయం పడిపోవడంతో జీతాలను చెల్లించడానికి ఇతర శాఖల మీద వచ్చే ఆదాయంపై ఆధార పడాల్సి వస్తోందని ట్రావెన్కూర్ దేవస్వొం బోర్డు అధ్యక్షుడు ఎన్ వాసు పేరును ఉటంకిస్తూ ఓ ఆంగ్ల దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ సీజన్లో అయ్యప్ప స్వామి ఆలయానికి వచ్చే ఆదాయం మొత్తం ఏడాది పొడవునా ఉద్యోగుల వేతనాలు, ఆలయాల నిర్వహణకు సరిపోతుందని వాసు పేర్కొన్నారు. ఈ సారి ఆ పరిస్థితులు ఉండకపోవచ్చని స్పష్టం చేశారు.
ఆంక్షలు సడలిస్తారా?
ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని భక్తుల సంఖ్యపై విధించిన ఆంక్షలను ఎత్తివేసే దిశగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవచ్చని అంటున్నారు. భక్తుల దర్శనం కోసం విధించిన సమయాన్ని 14 గంటలకు పెంచడం వల్ల కొంత ఉపయోగం ఉంటుందని అంటున్నారు. అదనపు సమయంలో అదనంగా భక్తులను దర్శనాన్ని కల్పించడానికి అవకాశం ఉంటుందని, ఫలితంగా- ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. రోజువారీ భక్తుల సంఖ్యను పెంచడానికి అవసరమైన ప్రతిపాదనలను మంత్రిత్వ శాఖకు పంపించారు. దీనిపై మంత్రి కడగంపల్లి సురేంద్రన్ సానుకూలంగా స్పందించవచ్చని అంటున్నారు.