అయ్యప్పస్వామి భక్తులకు శుభవార్త: శబరిమల ఆలయ తలుపులు తెరచుకోనున్నాయ్..కానీ!
తిరువనంతపురం: ఏటా కోట్లాదిమంది భక్తులు దర్శించుకునే శబరిమల అయ్యప్పస్వామి ఆలయం తలుపులు తెరచుకోబోతున్నాయి. ఈ నెల 14వ తేదీన మణికంఠుడి ఆలయాన్ని భక్తుల సందర్శన కోసం తెరవబోతున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. అయ్యప్పుడి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కరోనా వైరస్ నిబంధనలను పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆలయంలో భౌతికదూరాన్ని పాటించడం, మాస్కులను ధరించడం తప్పదని పేర్కొంది.
వైఎస్ జగన్ బెస్ట్ ఫ్రెండ్, తమిళ నటుడు సూర్య తండ్రిపై కేసు పెట్టిన టీటీడీ: తర తమ భేదాల్లేవ్
మిధున మాసంలో
మలయాళీల సంప్రదాయంలో మిథున మాసానికి ప్రత్యేకత ఉంది. వారి కేలెండర్ ప్రకారం.. ఈ నెల 15వ తేదీన మిథున మాసం ప్రారంభమౌతుంది. ఈ సందర్భంగా ఏటేటా జూన్ 14వ తేదీన శబరిమల ఆలయం తలుపులను తెరవడం ఆనవాయితీగా వస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులు అయ్యప్పస్వామి ఆలయాన్ని భక్తుల రాక కోసం పునరుద్ధరించబోతున్నారు. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు అధికారులు.
జూన్ 19 నుంచి 28 వరకు
మిథున మాసం ఆరంభ సమయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 19 నుంచి 28వ తేదీ వరకూ శబరిమలలో ప్రత్యేక పూజలను నిర్వహంచబోతున్నట్లు కేరళ దేవస్వొం మంత్రి కడగంపల్లి సురేంద్రన్ తెలిపారు. వర్చువల్ క్యూ పద్ధతిన భక్తులకు దర్శనాన్ని కల్పిస్తామని అన్నారు. గంటలో 200 మందికి దర్శనాన్ని కల్పించేలా ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు. దీని ప్రకారమే భక్తులు తమ పేర్లను ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
ఆలయ ప్రాంగణంలో 50 మందికే అనుమతి..
రద్దీని నివారించడానికి ఆలయ ప్రాంగణంలో 50 మంది భక్తులను మాత్రమే అనుమతి ఇస్తారు. గర్భాలయం ఎదురుగా స్వామివారిని దర్శించుకునే సమయంలో అయిదుమంది భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలుస్తోంది. ఆలయ ఆవరణలోకి ప్రవేశించడానికి ముందే భక్తులకు థర్మల్ స్క్రీనింగ్ ద్వారా వారి శరీర ఉష్ణోగ్రతను పరిశీలిస్తారు. పంపా నదీతీరం వద్ద కూడా ఇవే ఏర్పాట్లు చేసినట్లు కడగంపల్లి సురేంద్రన్ తెలిపారు.
గదులు దొరకవ్
దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులైనా సరే.. దర్శనం ముగించుకున్న వెంటనే వెనక్కి వెళ్లి పోవాల్సి ఉంటుందని సురేంద్రన్ స్పష్టం చేశారు. శబరిమలలో భక్తులెవరికీ బస చేసే సౌకర్యం ఇప్పట్లో ఉండబోదని అన్నారు. తెల్లవారు జామున 4 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ, మళ్లీ మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అయ్యప్పస్వామిని దర్శించుకునే అవకాశం కల్పించినట్లు మంత్రి తెలిపారు.
Recommended Video
పంప వరకూ మాత్రమే వాహనాలు..
పొరుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు చేరుకునే భక్తులు తప్పనిసరిగా తమ రాష్ట్ర ప్రభుత్వాల అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకొచ్చిన కోవిడ్ వెబ్ రిజిస్ట్రేషన్ పోర్టల్లో తమ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయించుకోవాల్సి ఉంటుందని సురేంద్రన్ అన్నారు. దీనితోపాటు- ఇతర రాష్ట్రాల భక్తులు తమకు కరోనా వైరస్ లేదని తెలియజేసే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ల్యాబ్ సర్టిఫికేట్ను ప్రూఫ్గా ఆయా వెబ్సైట్లలో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని, ఈ సమాచారాన్ని కేరళ ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలతో ఇచ్చిపుచ్చుకుంటుందని అన్నారు.