అయ్యప్ప నామస్మరణకు బదులు రణ నినాదాలు.. శబరిమల చుట్టు తిరిగిన 2018
హైదరాబాద్ : అయ్యప్ప నామస్మరణతో మార్మోగే శబరిగిరులు.. ఈ ఏడాది అంతా రణ నినాదాలతో ప్రతిధ్వనించాయి. తరాలుగా కొనసాగుతున్న విధానానికి బ్రేక్ వేయాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై భక్తజనులు మండిపడ్డారు. సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం సరికాదంటూ ఆందోళనలకు దిగారు. దీంతో 2018 లో శబరిమల టాప్ వార్తల్లో నిలిచింది. ఈక్రమంలో శబరిమల వివాదమేంటి? అసలేం జరిగింది? అనేదానిపై 2018 ఇయర్ ఎండ్ స్పెషల్ స్టోరీ.
సుప్రీం తీర్పు.. భగ్గుమన్న భక్తులు
శబరిమల ఆలయంలోకి మహిళలు రాకూడదనే నిబంధన దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఆ క్రమంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వివాదస్పదంగా మారింది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధం ఎత్తివేస్తూ సెప్టెంబర్ 28న సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. మతాచారాల పేరిట మహిళలపై వివక్ష చూపించడం తగదని.. అది రాజ్యాంగ మౌలిక సూత్రాలకు భిన్నమని పేర్కొంది. అంతేకాదు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాలరాస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేసింది. దీంతో అయ్యప్ప భక్తులతో పాటు హిందు సంఘాలు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించాయి.
సర్వోన్నత న్యాయస్థానం తీర్పుపై అయ్యప్ప భక్తులు భగ్గుమన్నారు. తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని కాలరాసేలా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని మండిపడ్డారు. 10-50 ఏళ్ల వయసున్న మహిళలు ఆలయంలోకి రాకూడదనే నిబంధనను అతిక్రమించడం సరికాదని వాదిస్తున్నారు. ఈక్రమంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించినవారికి, అయ్యప్ప భక్తులకు మధ్య వివాదం రాజుకుంది.
భక్తుల ఆగ్రహం.. ఆందోళన పర్వం
సుప్రీంకోర్టు తీర్పుతో కేరళ అట్టుడికింది. సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం దరిమిలా కొందరు మహిళలు ఆలయంలో ప్రవేశించడానికి ప్రయత్నించారు. అప్పటికే న్యాయస్థానం తీర్పుతో మండిపడుతున్న భక్తులు.. మహిళలను తీవ్రంగా ప్రతిఘటించారు. శబరిమల ఆలయంలోనికి రాకుండా అడ్డుపడ్డారు. శబరిమలకు వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. మహిళలుంటే వెనక్కి పంపించారు.
ఈక్రమంలో పోలీసులు అడ్డుపడటంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. పరిస్థితి చేయి దాటిన సందర్భంలో పోలీసులు లాఠీలు ఝలిపించారు. పెద్దసంఖ్యలో భక్తులు గాయపడ్డారు. ఒకరిద్దరు సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు ఆలయంలోనికి వెళ్లాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు. భక్తుల ఆందోళనతో వెనుదిరగక తప్పలేదు.
750 కిలోమీటర్ల మేర జ్యోతులు.. అయ్యప్ప భక్తుల వినూత్న నిరసన
కేరళలో టెన్షన్ టెన్షన్.. రోడ్డెక్కిన భక్తులు
సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు కేరళలోని వామపక్ష ప్రభుత్వం ప్రయత్నించడంతో వివాదం మరింత జఠిలమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. న్యాయస్థానం తీర్పును వ్యతిరేకిస్తూ.. అటు మహిళలు కూడా వేల సంఖ్యలో రోడ్డెక్కారు. ఇక కేరళ ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం కూడా రసాభాసాగా మారింది.
కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా తాము నిర్ణయం తీసుకోలేమని.. మహిళలను ఆలయంలోకి అనుమతిస్తామని సీఎం పినరయి విజయన్ స్పష్టం చేయడంతో బీజేపీ, కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. విపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకోవడం లేదని సమావేశం నుంచి వాకౌట్ చేశారు. అదలావుంటే ఆలయంలోనికి అనుమతించాలని కోరుతూ వందల సంఖ్యలో మహిళలు కేరళ పోలీస్ వెబ్సైట్ లో తమ పేర్లు నమోదు చేసుకోవడం గమనార్హం.
ట్రాన్స్జెండర్లు సక్సెసా?
మహిళలు శబరిమల అయ్యప్పను దర్శించుకోవచ్చనే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో.. నలుగురు ట్రాన్స్జెండర్లు స్వామి వారి సన్నిధికి చేరారు. డిసెంబర్ 16న అయ్యప్ప దర్శనానికి వచ్చిన ట్రాన్స్జెండర్లను పోలీసులు అడ్డుకున్నారు. అయితే వారు ఆందోళనకు దిగడంతో.. ఆలయ ప్రధాన పూజారితో చర్చించారు. ఆయన ఓకే చెప్పడంతో ఈ నలుగురికి దర్శనభాగ్యం కలిగింది. డ్రెస్ కోడ్ లో ఇరుముడితో సంప్రదాయబద్ధంగా వచ్చిన వీరికి పోలీసులు భద్రత కల్పించారు. శబరిమలలో పవిత్రంగా భావించే 18 మెట్లను ఎక్కి సన్నిధానంకు చేరుకున్నారు.
తెలంగాణ సామాజిక ఉద్యమకారులు.. 2018 స్మృతులు
జ్యోతులతో నిరసన.. 750 కిలోమీటర్లు
శబరిమల ఆలయానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హిందువులు తీవ్ర స్వరంతో ఖండిస్తున్నారు. దశాబ్ధాలుగా వస్తున్న ఆచారానికి సర్వోన్నత న్యాయస్థానం తీర్పు గండికొట్టేలా ఉందని మండిపడుతున్నారు. దీనిపై కేరళ రాష్ట్రంలో ఆందోళనలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అందులోభాగంగా డిసెంబర్ 27న కనివినీ ఎరుగని రీతిలో చేపట్టిన కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించింది. 750 కిలోమీటర్ల మేర రోడ్లపై నిలబడ్డ భక్తులు జ్యోతులు వెలిగించి నిరసన వ్యక్తం చేశారు.