రూపురేఖలు మారాయి: స్కూల్కు సచిన్ విరాళం 76 లక్షలు
కోల్కత్తా: పశ్చిమబెంగాల్లోని పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలోని ఓ స్కూలుకు రూ. 76 లక్షల గ్రాంటు రావడంతో ఆ స్కూలు రూపు రేఖలే మారిపోయాయి. వివరాల్లోకి వెళితే... తమ స్కూలు దుస్థితి పట్ల ఎంతమంది అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో స్వర్ణమయి సస్మల్ శిక్షా నికేతన్ స్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు కలసి రాజ్యసభ సభ్యుడు, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్కి తమ స్కూలు దుస్థితిని వివరిస్తూ ఓ లేఖ రాశారు.
దీంతో రాజ్యసభ ఎంపీ అయిన సచిన్ టెండూల్కరం తన ఎంపీలాడ్స్ నిధుల ద్వారా ఆ స్కూలు అభివృద్ధికి రూ. 76 లక్షలు గ్రాంటుని విడుదల చేశారు. సచిన్ విడుదల చేసిన నిధులు గతేడాది ఆర్ధిక సంవత్సరంలోనే స్కూలుకు అందాయి. ఈ నిధులతో స్కూలుని అభివృద్ధి చేశారు. దీంతో స్కూలు రూపురేఖలే మారిపోయాయి.
దీనిపట్ల స్కూలు విద్యార్ధులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సచిన్ విడుదల చేసిన నిధులతో స్కూలు రూపురేఖలే మారిపోవడంతో సచిన్కు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా తెలియడం లేదని, తమకు నోట మాట రావట్లేదని స్కూలు ఉపాధ్యాయుడు ఉత్తమ్ కుమార్ మొహంతి చెప్పారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 50 ఏళ్ల చరిత్ర కలిగిన స్వర్ణమయి సస్మల్ శిక్షా నికేతన్ స్కూల్లో ప్రస్తుతం 900 మంది విద్యార్థులు విద్యను కొనసాగిస్తున్నారు. సచిన్ నిధులతో కొంత మేరకు అభివృద్ధి చెందగా, పనిలో పనిగా తమ స్కూలు అభివృద్ధి కోసం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని మరిన్ని నిధులు అడగాలని ప్రధానోపధ్యాయుడు నిర్ణయించారు.
స్కూలు భవనాలు పూర్తిగా సిద్ధమైన తర్వాత వాటిని ప్రారంభించేందుకు సచిన్ టెండూల్కర్ను ఆహ్వానించే దిశగా ప్రయత్నాలు కూడా చేస్తున్నామని ఆయన తెలిపారు. సచిన్కు అభిమానులైన ఈ స్కూలు విద్యార్ధులు తమ స్కూలు దుస్థితిని వివరిస్తూ 2014లో ఓ లెటర్ రాశారు.
అందులో లైబ్రరీ రూం, లేబరేటరీ, బాలికల కోసం కామన్ రూం లాంటి కావాలని అందులో పేర్కొన్నారు. ఈ లెటర్ను అందుకున్న సచిన్ గతేడాది తన ఎంపీ లాడ్స్ కింద రూ. 76 లక్షలను గ్రాంటు రూపంలో విడుదల చేయడంతో స్కూలు వర్గాలు ఎంతో సంతోషించాయి.