సచిన్కు భారత రత్న కోరతా: శుక్లా, బాలీవుడ్ తారలు
ముంబై: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరును తను ప్రతిపాదించిన నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అతన్ని రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేశారని బిసిసిఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. అయితే రిటైర్మెంట్ తర్వాత సచిన్ టెండూల్కర్కు భారత అత్యున్నత పురస్కారమైన భారత రత్న అవార్డును అందించాలని కోరుకుంటున్నట్లు శుక్లా తెలిపారు.
ముంబైలో జరిగిన సలామ్ సచిన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడుతున్న సమయంలోనే జూన్ 2012లో రాజ్యసభకు నామినేట్ చేయబడ్డారని, ఆటలో కొనసాగుతుండగా ఈ గౌరవం పొందిన తొలి ఆటగాడు సచిన్ అని ఆయన అన్నారు.
సునీల్ గవాస్కర్, రవిశాస్త్రిల పేర్లు ప్రతిపాదనకు వచ్చినప్పటికీ సోనియాగాంధీ సచిన్ పేరును పార్లమెంటుకు నామినేట్ చేసినట్లు తెలిపారు. ఈ విషయంపై సచిన్, ఆయన కుటుంబ సభ్యులతో చర్చించినట్లు తెలిపారు. సచిన్ తన కుటుంబ సభ్యులకు ఈ విషయంపై ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడంతో సోనియాగాంధీ అతన్ని రాజ్యసభకు నామినేట్ చేసినట్లు శుక్లా తెలిపారు.
200వ టెస్ట్ మ్యాచుకు బాలీవుడ్ తారలు
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నవంబర్ 14 నుంచి 18వరకు వాంఖేడే స్డేడియంలో జరుగనున్న మ్యాచుకు బాలీవుడ్ తారలు హాజరుకానున్నారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చివరిదైన 200వ టెస్టు మ్యాచు కావడంతో బాలీవుడ్ తారలు మ్యాచును చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బాలీవుడ్ కథనాయకులు అమీర్ఖాన్, రణ్బీర్ కపూర్, షాహిద్ కపూర్, వరుణ్ ధావన్, సుశాంత్ సింగ్ రాజ్పుత్ తదితరులు మ్యాచును ప్రత్యక్షంగా వీక్షించనున్నారు.
అయితే ఈ మ్యాచును బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ వీక్షించలేకపోతున్నాడు. గతంలో స్టేడియం సెక్యూరిటీ గార్డులతో జరిగిన వివాదం సందర్భంగా మరోసారి ఈ స్టేడియంలో అడుగుపెట్టనని షారుక్ అన్నారు. దీంతో సచిన్ రిటైర్మెంట్ తీసుకునే టెస్ట్ సిరీస్ను షారుక్ దూరమవుతుతున్నారు. కోల్కతాలో జరిగిన 199వ టెస్టు మ్యాచు మూడు రోజుల్లో ముగియడంతో ఆ మ్యాచును చూసేందుకు కూడా షారుక్కు అవకాశం లేకపోయింది.