సచిన్ పైలట్కు కాంగ్రెస్ షాక్, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ పదవీ నుంచి ఔట్, మంత్రులు కూడా..
కాంగ్రెస్ పార్టీపై ధిక్కార స్వరం వినిపించి ఎదురు తిరిగిన సచిన్ పైలట్పై కాంగ్రెస్ పార్టీ చర్యలకు ఉపక్రమించింది. డిప్యూటీ సీఎం, రాజస్తాన్ పీసీసీ చీఫ్ పదవీ నుంచి తొలగించింది. పైలట్ క్యాంపులో ఉన్న ఇద్దరు మంత్రులు విశ్వేంద్ర సింగ్, రమేశ్ చంద్ మీనా పదవుల నుంచి తప్పించింది. జైపూర్ శివారులో జరిగిన సీఎల్పీ సమావేశానికి పైలట్, అతని సన్నిహతులు హాజరుకాలేదు. నిన్న గెహ్లట్ నివాసంలో కూడా సీఎల్పీ భేటీ జరిగింది.
సమస్యను పార్టీలో చర్చించాలని పైలట్ను పదే పదే కాంగ్రెస్ పార్టీ కోరింది. ఇంటి సమస్య పరిష్కరించుకోవాలని కోరింది. కానీ ఆయన వెనక్కి తగ్గడంతో పార్టీ, ప్రభుత్వ పదవుల నుంచి తొలగించింది. రాజస్తాన్ పీసీసీ చీఫ్ పదవీ నుంచి పైలట్ను తొలగించారు. అతని స్థానంలో గోవింద్ సింగ్ను రాజస్తాన్ పీసీసీ చీఫ్గా నియామించారు.
మంత్రులు విశ్వేంద్ర సింగ్, రమేశ్ చంద్ మీనా, ఎమ్మెల్యేలు హరీశ్ మీనా, దీపేంద్ర సింగ్ షెకావత్, హెమరాం చౌదరి, బ్రిజేంద్ర సింగ్ ఓలా, గజ్రాజ్, రాకేష్ పరేఖ్, పృథ్వీరాజ్ మీనా, భన్వర్ లాల్ శర్మ, మురళీలాల్ మీనా, రామ్ నివాస్ గౌరియా, సురేశ్ మోడీ, ఇంద్రజీత్ సింగ్, అమర్ సింగ్, గజేంద్ర సింగ్ షెకావత్, వేద్ ప్రకాశ్ సోలంకి, లోకేంద్ర సింగ్ సీఎల్పీ భేటీకి హాజరుకాలేదు. మంత్రులు, పైలట్పై వేటు పడగా... ఎమ్మెల్యేలపై ఆచి తూచి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.