అనర్హత నోటీసుపై సుప్రీం తలపు తట్టనున్న సచిన్, ఈసీ వద్దకు కూడా, పైలట్ సహా 19 మందికి స్పీకర్ నోటీసులతో
రాజస్తాన్ కాంగ్రెస్ రెబల్ సచిన్ పైలట్పై హై కమాండ్ ఓ వైపు సంప్రదింపులు జరుపుతూనే మరోవైపు చర్యలకు ఉపక్రమిస్తోంది. తిరుగుబాటు ఎగరేసిన పైలట్ సహా 19 మందికి స్పీకర్ సీపీ జోషి అనర్హత నోటీసులు పంపించారు. పరిస్థితిని నిశీతంగా గమనిస్తున్న పైలట్.. ఆచి తూచి అడుగులేస్తున్నారు. స్పీకర్ పంపిన నోటీసులపై సుప్రీంకోర్టు తలుపు తట్టాలని భావిస్తున్నారు. ఈ మేరకు న్యాయ నిపుణులతో పైలట్ సంప్రదింపులు జరుపుతున్నారు.
అనర్హత నోటీసులు..
ధిక్కార స్వరం వినిపించిన సచిన్ పైలట్ అండ్ కోకు రాజస్తాన్ కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. సీఎల్పీ సమావేశానికి రావాలని కోరింది. కానీ వరసగా రెండురోజులు కూడా పైలట్ సహా అతని మద్దతుదారులు హాజరుకాలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ అనర్హత వేటు వేయాలని కోరడంతో ఈ మేరకు స్పీకర్ నోటీసులు పంపించారు. సచిన్ పైలట్, ఇద్దరు మంత్రులు సహా మొత్తం 19 మందికి స్పీకర్ జోషి నోటీసులు పంపించారు.
సుప్రీంకోర్టుతోపాటు ఈసీ
సుప్రీంకోర్టుతోపాటు ఎన్నికల సంఘం దృష్టికి కూడా సమస్యను తీసుకెళ్లాలని సచిన్ పైలట్ భావిస్తున్నారు. తమకు స్పీకర్ అనర్హత నోటీసులు జారీచేశారని ఈసీని తెలియజేయనున్నారు. మరోవైపు ప్రియాంక గాంధీ ఇప్పటికీ కూడా సచిన్ పైలట్తో చర్చలు జరపాలని కాంగ్రెస్ నేతలకు సూచించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో పైలట్పై కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తోన్న వైఖరిపై స్పష్టత లేకుండా పోయింది.
నోటీసులు
ఇప్పటికే డిప్యూటీ సీఎం, రాజస్తాన్ పీసీసీ చీఫ్ పదవీని తొలగించిన సంగతి తెలిసిందే. అతని ఇద్దరు మంత్రులను కూడా తొలగించారు. కానీ పైలట్ మాత్రం తాను కాంగ్రెస్ వాదినేనని స్పష్టం చేశారు. బీజేపీలో చేరబోనని చెప్పడంతో.. కాంగ్రెస్లో ఒక వర్గం నేతల్లో ఆశలు చిగురించాయి. కానీ వెంటనే స్పీకర్ నోటీసులతో పైలట్ కూడా అందుకు ధీటుగానే స్పందిస్తున్నారు.
సంప్రదింపులు..
రణదీప్ సుర్జేవాలా, కపిల్ సిబాల్ ఇతర నేతలు మాత్రం పైలట్ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కోరుతున్నారు. మనమంతా కాంగ్రెస్ కుటుంబం అని, తిరిగి కలిసిపోవాలని కోరుతున్నారు. పైలట్ కోసం కాంగ్రెస్ పార్టీ డోర్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయని స్పష్టంచేశారు. తాను చేసిన తప్పు తెలుసుకుంటే.. భగవంతుడి దయతో తిరిగి పైలట్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని ఆశాభావం వ్యక్తం చేశారు. పైలట్ బీజేపీ భ్రమ నుంచి బయటపడాలని కోరుకుంటున్నానని రాజస్తాన్ కాంగ్రెస్ ఇంచార్జీ అవినాశ్ పాండే తెలిపారు.
పరిష్కారం దిశగా..?
పైలట్కు సంబంధించి అన్ని సమస్యలను ఆలకిస్తామని, పరిష్కరిస్తామని రణదీప్ సుర్జేవాలా మరోసారి స్పష్టంచేశారు. సమస్యను కూర్చొని పరిష్కరించుకోవాలని కోరారు. బీజేపీ భ్రమ నుంచి పైలట్ తేరుకోవాలని కోరారు. పైలట్ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు నేతలు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కానీ పైలట్ మాత్రం ససేమిరా అనడంతో రాజస్తాన్ ప్రభుత్వంలో అస్థిరత్వం కొనసాగుతూనే ఉంది.