రిహన్నా ట్వీట్కు సచిన్ కౌంటర్... భారత్ కోసం ఏం చేయాలో భారతీయులకు తెలుసని ట్వీట్...
ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలకు అంతర్జాతీయ సమాజం నుంచి మద్దతు లభిస్తుండటంతో దీనిపై కొత్త చర్చ మొదలైంది. భారతదేశ అంతర్గత విషయాల్లో బయటి వ్యక్తుల జోక్యమేంటని బీజేపీ మద్దతుదారులతో పాటు పలువురు సెలబ్రిటీలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు,భారత్ టార్గెట్గా జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో భారతరత్న,భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా చేరారు.
Recommended Video
'భారతదేశ సార్వభౌమత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడదు. బయటి వ్యక్తులు కేవలం ప్రేక్షకుల్లా ఉండాలే గానీ ఇక్కడి వ్యవహారాల్లో భాగస్వాములు కాలేరు. భారత్ ఏంటో భారతీయులకు తెలుసు... వాళ్లు మాత్రమే భారత్కు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలి.' అని టెండూల్కర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు #Indiatogether #IndiaAgainstPropaganda అనే హాష్ ట్యాగ్స్ను ట్యాగ్ చేశారు.
ప్రముఖ పాప్ సింగర్ రిహన్నా రైతుల ఉద్యమానికి పరోక్షంగా మద్దతు తెలపడంతో దేశవ్యాప్తంగా బీజేపీ,రైట్ వింగ్ శ్రేణులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిహన్నాతో పాటు రైతులకు మద్దతుగా నిలిచిన పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్బర్గ్,అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మేనకోడలు మీనా హ్యారిస్లపై మండిపడుతున్నారు. భారత అంతర్గత విషయాల్లో మీ జోక్యం అవసరం లేదని చెబుతున్నారు.
India’s sovereignty cannot be compromised. External forces can be spectators but not participants.
— Sachin Tendulkar (@sachin_rt) February 3, 2021
Indians know India and should decide for India. Let's remain united as a nation.#IndiaTogether #IndiaAgainstPropaganda
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో #farmersprotest హాష్ ట్యాగ్,#IndiaTogether #IndiaAgainstPropaganda హాష్ ట్యాగ్స్ పోటాపోటీగా ట్రెండ్ అవుతున్నాయి. బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్,కంగనా రనౌత్,దర్శకుడు కరణ్ జోహార్,క్రికెటర్లు శిఖర్ ధావన్,సురేష్ రైనా,మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, అనిల్ కుంబ్లే, ఆర్పీ సింగ్ ఇప్పటికే #IndiaAgainstPropaganda హాష్ ట్యాగ్తో ట్వీట్లు చేశారు. ఇప్పటివరకూ ఈ హాష్ ట్యాగ్పై 5.5 లక్షల ట్వీట్లు రావడం గమనార్హం. మరోవైపు అంతే స్థాయిలో రైతులకు మద్దతుగా ట్విట్టర్లో ట్వీట్లు పోటెత్తుతున్నాయి.
కాగా,రైతుల ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో భారత ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిందని ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్ఎన్ ప్రచురించిన వార్తను రిహన్నా తన ట్విట్టర్లో షేర్ చేసిన సంగతి తెలిసిందే. 'ఎందుకని మనం దీని గురించి మాట్లాడుకోవట్లేదు...?' అని ఆ పోస్టుకు తన కామెంట్ను,#farmersprotest అనే హాష్ ట్యాగ్ను జత చేశారు. దీంతో పరోక్షంగా ఆమె రైతు ఉద్యమానికి మద్దతు పలికినట్లయింది. రిహన్నా ట్వీట్కు ట్విట్టర్లో 92వేల పైచిలుకు రియాక్షన్స్,2లక్షల పైచిలుకు రీట్వీట్లు,5లక్షల పైచిలుకు లైక్స్ వచ్చాయి. దాంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.