స్టార్టప్ వైపు సచిన్ చూపు: హైద్రాబాద్ కంపెనీలో పెట్టుబడులు
హైదరాబాద్: ఇటీవల కాలంలో ప్రముఖ వ్యాపారవేత్తలు తమకు నచ్చిన స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టి వార్తల్లో నిలుస్తున్నారు. స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడుల పెట్టే వారిలో టాట్ గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా ముందు వరుసలో ఉన్నారు. తాజాగా ఇప్పుడు ఈ కోవలోకి క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ చేరారు.
తొలిసారిగా హైదరాబాద్కు చెందిన టెక్నాలజీ స్టార్టప్ కంపెనీ స్మాట్రాన్లో సచిన్ టెండూల్కర్ పెట్టుబడులు పెట్టారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ) ఆధారిత స్మార్ట్ డివైజ్లను తయారు చేసే ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా సచినే వ్యవహారిస్తున్నారు.
అయితే ఈ కంపెనీలో ఎంతమొత్తంలో పెట్టుబడులు పెట్టారనే విషయం మాత్రం తెలియరాలేదు. ఆగస్టు 2014లో ప్రారంభమైన స్మాట్రాన్.. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో తమ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది.
స్మాట్రాన్ కంపెనీ వ్యవస్థాపకులు మహేష్ లింగారెడ్డి అమెరికాలో సెమీ కండక్టర్స్ కార్యకలాపాలను సాగించే సాఫ్ట్ మెషీన్స్ అనే ఓ సంస్ధను నిర్వహిస్తున్నారు. సచిన్ టెండూల్కర్ స్మాట్రాన్లో పెట్టుబడులు పెట్టడంపై లింగారెడ్డి మాట్లాడుతూ మాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నామన్నారు.
మా రోజుల్లో ఆయన గురించి ఎన్నో స్టోరీలను చదువుకున్నామని తెలిపారు. యువతకి క్రికట్ పట్ల ఆసక్తి కలగజేసే విధంగా క్రికెట్ ఆడిన ఓ లెజెండ్ అని కొనియాడారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత సచిన్ టెండూల్కర్ అంతక ముందు కేరళలో ప్రారంభమైన మెగా స్పోర్ట్ సిటీలోనూ సచిన్ పెట్టుబడులు పెట్టారు.