ఖాతా తెరిచిన సచిన్: ఎట్టకేలకు రాజ్యసభకు హాజరు
భారత మాజీ క్రికెట్ దిగ్గజం, ఎంపీ సచిన్ టెండూల్కర్ ఎట్టకేలకు గురువారం రాజ్యసభకు హాజరయ్యారు. అతను ఎలాంటి ప్రశ్నలు అడగకపోయినప్పటికీ.. సభలోనే కూర్చున్నారు.
న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెట్ దిగ్గజం, ఎంపీ సచిన్ టెండూల్కర్ ఎట్టకేలకు గురువారం రాజ్యసభకు హాజరయ్యారు. అతను ఎలాంటి ప్రశ్నలు అడగకపోయినప్పటికీ.. సభలోనే కూర్చున్నారు. సచిన్తోపాటు మరో నామినేటెడ్ ఎంపీ, బాక్సర్ మేరీ కోమ్ కూడా సభకు వచ్చారు. వర్షాకాల సమావేశాల్లో సచిన్ హాజరవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఈ మధ్య సమాజ్వాదీ ఎంపీ నరేశ్ అగర్వాల్.. సచిన్, రేఖల గైర్హాజరీ అంశాన్ని లేవనెత్తిన విషయం తెలిసిందే. అసలు సభలో ఎప్పుడూ కనిపించని సచిన్, రేఖల సభ్యత్వాన్ని రద్దు చేయాలని, వాళ్లను సభ నుంచి బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
విజయ్ మాల్యాను సభ నుంచి బహిష్కరించినపుడు.. వీరిని మాత్రం ఎందుకు చేయకూడదు అని నరేశ్ అగర్వాల్ ప్రశ్నించారు. గతంలోనూ ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. వివిధ రంగాల నుంచి నామినేట్ అయిన 12 మంది సభ్యులు ఎప్పుడూ సభకు రావడం లేదని అగర్వాల్ గుర్తుచేశారు. వాళ్లకు ఆసక్తి లేకపోతే రాజీనామా చేయొచ్చు కదా అని అప్పట్లో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
2012లో రాజ్యసభకు సచిన్ నామినేట్ అయ్యారు. అప్పటి నుంచి 348 రోజులు సభ నడవగా.. సచిన్ మాత్రం 23 రోజులే హాజరయ్యాడు. రేఖ అయితే కేవలం 18 రోజులు మాత్రమే సభలో కనిపించారు. బడ్జెట్ సెషన్, అంతకుముందు జరిగిన వింటర్ సెషన్లో ఒక్క రోజు కూడా వీళ్లు రాలేదు. అయితే, సచిన్ టెండూల్కర్ 22 ప్రశ్నలు లేవనెత్తారు. రేఖ మాత్రం ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. నామినేటెడ్ ఎంపీల్లో కేటీఎస్ తులసీ మాత్రం ఎక్కువ ప్రశ్నలు సంధించారు.