ఎంపీలాడ్స్ నుండి ఒక్క పైసా ఖర్చు చేయని సచిన్, రేఖ
న్యూఢిల్లీ: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, బాలీవుడ్ అలనాటి అందాల నటి రేఖలు రెండేళ్లుగా తమ ఎంపీ నిధులను మురుగ పెడుతున్నారట. సచిన్, రేఖలు రాజ్యసభకు నామినేట్ అయిన విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్లుగా వారు అభివృద్ధి కోసం పైసా ఖర్చు పెట్టలేదు.
వారు అడాప్ట్ చేసుకున్న ప్రాంతాలకు వారు ఇంత వరకు ఏమీ ఖర్చు చేయలేదు. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అధికారిక వెబ్సైట్లో ఖర్చు చేయని ఎంపీల వివరాలను ఉంచారు.
రాజ్యసభ సభ్యులు ఏదైనా ఓ జిల్లా బాధ్యతను తీసుకునే అవకాశముంది. ప్రతి రాజ్యసభ సభ్యుడికి సంవత్సరానికి ఐదు కోట్ల రూపాయలను ప్రభుత్వం అభివృద్ధి నిమిత్తం ఎంపీ లాడ్స్ నుండి కేటాయిస్తుంది. సచిన్, రేఖలకు రెండేళ్లలో ఎంపీ లాడ్స్ కింద పదికోట్ల రూపాయలు ఉన్నాయి.
అయితే, వారు మాత్రం ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. అయితే, సచిన్ టెండుల్కర్ ఇటీవలె ముంబై సబర్బన్ జిల్లా బాధ్యతను తీసుకున్నారు. రేఖ మాత్రం ఇంకా తీసుకోలేదు. వీటిపై విమర్శలు వినిపిస్తున్నాయి.