నా కొడుకు ఓటమికి బాధ్యత ఆయనదే: అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు
రాజస్థాన్లోని జోద్పూర్ నియోజకవర్గంలో తన కొడుకు వైభవ్ గెహ్లాట్ ఓటమికి బాధ్యత సచిన్ పైలట్దే అని ఆరోపించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత రాజస్థాన్లో ఘోర ఓటమి చవిచూసిన కాంగ్రెస్లో అప్పుడే నిందారోపణలు మొదలయ్యాయి. జోద్పూర్ స్థానం అశోక్గెహ్లాట్కు కంచుకోటగా ఉండేది. ఇక్కడి నుంచి ఆయన లోక్సభకు ఐదుసార్లు గెలిచారు. ప్రచారం సందర్భంగా జోద్పూర్లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ గెలుస్తుందని ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ సచిన్ పైలట్ అన్నారని గుర్తు చేసిన గెహ్లాట్ ఇప్పుడు ఓటమికి బాధ్యత కూడా తానే తీసుకోవాలన్నారు.
ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్లు బాధ్యత వహించాలని అంటే అప్పుడు ఓటమికి సమిష్టి బాధ్యత తీసుకుంటామని గెహ్లాట్ తెలిపారు. అశోక్ గెహ్లాట్ వల్లే రాజస్థాన్లో కాంగ్రెస్ ఘోర ఓటమి చవి చూసిందని ఆ పార్టీ అద్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. తన కొడుకుపై పెట్టిన దృష్టి ఇతర నియోజకవర్గాల్లో కూడా పెట్టి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని రాహుల్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో అశోక్ గెహ్లాట్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక రాజస్థాన్లో ఘోర ఓటమి తర్వాత వైభవ్ అభ్యర్థిత్వాన్నే కొందరు నేతలు ప్రశ్నించారు. ఇందులో ఉదయ్ లాల్ అంజనా చాలా ఘాటుగానే ప్రశ్నించారు.
కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న జోద్పూర్ నియోజకవర్గంలో వైభవ్ గెహ్లాట్ను అభ్యర్థిగా పెట్టి పెద్ద తప్పు చేశామన్న అంజనా... అందుకు తగ్గ ప్రతిఫలం అనుభవిస్తున్నామనే ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే తాను జాలోర్ నియోజకవర్గం వైభవ్కు సరైన నియోజకవర్గం అని తాను సూచించినప్పటికీ తన మాటను పెడ చెవిన పెట్టారని ఈ రోజు ఫలితాన్ని అనుభవిస్తున్నారని ఒక్కింత ఆగ్రహం వ్యక్తం చేశారు అంజనా. జాలోర్లో సమీకరణాలపై తనకు అవగాహన ఉందని అందుకే అక్కడి నుంచి వైభవ్ గెహ్లాట్ను బరిలోకి దింపాల్సిందిగా కోరినట్లు అంజనా చెప్పారు. ఇదిలా ఉంటే వైభవ్ గెహ్లాట్ కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేతిలో 4 లక్షల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇదిలా ఉంటే వైభవ్ కోసం అశోక్ గెహ్లాట్ విపరీతమైన ప్రచారం చేసినప్పటికీ ఫలితం రాలేదు.