మరో వివాదంలో ఎన్నికల కమిషన్: సుప్రీంకోర్టును ఆశ్రయించిన తేజ్ బహదూర్
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషన్ మరో వివాదంలో చిక్కుకుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు వ్యవహారంలో ఇప్పటికే- దేశంలోని 21 ప్రతిపక్ష పార్టీల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్న కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా మరో వివాదానికి కేంద్ర బిందువైంది. ఉద్వాసనకు గరైన బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మహాకూటమి అభ్యర్థిగా ఉత్తర్ ప్రదేశ్లోని వారణాశి నుంచి ఆయన దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి తిరస్కరించిన నేపథ్యంలో.. ఆయన సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ను ప్రతివాదిగా చేర్చారు. సరైన కారణాన్ని చూపకుండా తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారనే కారణాన్ని ఆయన పిటీషన్లో పొందుపరిచారు.
తేజ్ బహదూర్ యాదవ్ గతంలో బీఎస్ఎఫ్లో పనిచేశారు. సైన్యానికి నాసిరకం ఆహారాన్ని అందజేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల ద్వారా కేంద్రంపై ఆరోపణలు గుప్పించారు. ఈ ఘటన అనంతరం ఆయనను సైనికాధికారులు ఉద్వాసన పలికారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. సమాజ్వాది పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. ఆ పార్టీ అభ్యర్థిగా ఉత్తర్ ప్రదేశ్లోని వారణాశి నుంచి లోక్సభ ఎన్నికల బరిలో దిగారు. నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
వారణాశి నుంచి బీజేపీ అభ్యర్థి, ప్రధానమంత్రి నరేంద్రమోడీపై తేజ్ బహదూర్ యాదవ్ పోటీకి దిగిన విషయం తెలిసిందే. ఉద్యోగం నుంచి ఎందుకు తొలగించాల్సి వచ్చిందనే కారణాన్ని ఆయన తన నామినేషన్ పత్రాల్లో పొందుపరచలేదు. నిబంధనల ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగి ఉద్వాసనకు గురై, ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తే, దానికి గల కారణాలను నామినేషన్ పత్రాల్లో పొందుపరచాల్సి ఉంటుంది. దీన్ని ఆయన విస్మరించారు. ఇదే కారణాన్ని చూపుతూ- రిటర్నింగ్ అధికారి తేజ్ బహదూర్ యాదవ్ నామినేషన్ పత్రాలను తిరస్కరించారు. ఈ విషయంలో తనకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఆయన సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. తేజ్ బహదూర్ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదించబోతున్నారు.