అవినీతి ఐటీ అధికారులపై మరోసారి కేంద్రం కొరడా..ఈ సారి ఇంతమంది ఔట్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఐటీ డిపార్ట్మెంట్లో అవినీతి చేపలను ఏరివేసే ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా 15 మంది అవినీతి అధికారులను గుర్తించిన కేంద్రం వారిని తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నిర్ణయం ఆర్థిక మంత్రిత్వ శాఖ తీసుకుంది. ఇప్పటి వరకు నాలుగు దఫాలుగా ఐటీ శాఖలో అవినీతి ముద్ర పడ్డ అధికారులను కేంద్రం తొలగించింది. గత మూడు దఫాలుగా చేపట్టిన తొలగింపు ప్రక్రియలో 49 ఉన్నతాధికారులకు కేంద్రం స్వస్తి పలికింది. ఇందులో 12 మంది అధికారులు సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్లో పనిచేస్తున్న వారు కావడం విశేషం.
తొలి దఫా తొలగింపు ప్రక్రియ మోడీ సర్కార్ రెండో సారి అధికారంలోకి రాగానే చేపట్టింది. జూన్ 10న ఆదాయపుపన్ను శాఖలో 12 మంది అవినీతి అధికారులకు బలవంతపు పదవీవిరమణ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. జూన్ 15న రెండో దఫా తొలగింపును చేపట్టింది కేంద్రం. ఆ సమయంలో 15 మంది అవినీతి అధికారులపై వేటు వేసింది. ఆ తర్వాత ఒక నెలరోజుల పాటు గ్యాప్ ఇచ్చిన ప్రభుత్వం ఆగష్టు 22న మళ్లీ కొరడా ఝుళిపిస్తూ 22 మంది ఆఫీసర్లకు పింక్ స్లిప్పులను జారీ చేసింది. ఇక తాజాగా జరిగిన తొలగింపు ప్రక్రియలో 22 మందిపై వేటు వేసింది.
ఇక తాజాగా తొలగింపునకు గురైన వారిలో ప్రిన్సిపల్ కమిషనర్ ఇన్కంటాక్స్ ఉన్నారు. మరో ఉన్నతాధికారి వ్యాపారుల నుంచి పెనాల్టీలు కట్టించుకోకుండా లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలపై తొలగించింది కేంద్రం. జూన్ 10న జరిగిన తొలగింపు ప్రక్రియలో ఓ జాయింట్ కమిషనర్ ర్యాంకు అధికారిని పక్కనబెట్టింది. అతను చంద్రస్వామిని అనే స్వామీజీని కాపాడే ప్రయత్నంలో ఓ వ్యాపారి అతన్ని సంప్రదించగా లంచం తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి.
మరో ఐఆర్ఎస్ అధికారిని కూడా అదే సమయంలో నోయిడాలో తొలగించింది. ఇద్దరు మహిళా ఐఆర్ఎస్ ఆఫీసర్లపై లైంగిక వేధింపులకు దిగారనే ఆరోపణలు రావడంతో అతనిపై వేటువేశారు. ఇక మరో అవినీతి ఐఆర్ఎస్ అధికారి ఆస్తులు రూ.3.17 కోట్లు గుర్తించింది కేంద్రం. అధికారాన్ని అడ్డంగా పెట్టుకుని ఆస్తులు సంపాదించినట్లు ఆయనపై కేసు నమోదు చేశారు.