ఆంగ్లో ఇండియన్స్కు చేదువార్త: ఇకపై చట్టసభల్లో ఆంగ్లో ఇండియన్స్ ప్రాతినిథ్యం కట్
లోక్సభ అసెంబ్లీల్లో ఆంగ్లో ఇండియన్స్కు ఇకపై ప్రాతినిథ్యం ఉండదా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇక పై లోక్సభలో అసెంబ్లీలో ఆంగ్లో ఇండియన్స్కు చోటు కల్పించరాదనే కృతనిశ్చయంతో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకోసం కేంద్రం రాజ్యాంగ సవరణను చేపడుతోంది. సోమవారం ఈ మేరకు సవరించిన బిల్లును లోక్సభలో కేంద్రం ప్రవేశ పెట్టింది.
చట్ట సభల్లో నో ఆంగ్లో ఇండియన్స్
భారత దేశంలో ఆంగ్లో ఇండియన్స్ జనాభా బాగానే ఉంది. వారికంటూ చట్టసభల్లో చోటు కల్పించాలని రాజ్యాంగంలో ఉంది. గత 70 ఏళ్లుగా ఆంగ్లో ఇండియన్స్కు ఇటు పార్లమెంటులో అటు రాష్ట్ర అసెంబ్లీల్లో నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతున్నారు. గత 70 ఏళ్లుగా అమలులో ఉన్న అంశాన్ని కేంద్రం తొలగిస్తూ సోమవారం పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ప్రకారం ఆంగ్లో ఇండియన్స్కు చట్ట సభల్లో చోటు కల్పించేలా ఉన్న ప్రొవిజన్ను గత ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ప్రొవిజన్ వచ్చే ఏడాది జనవరితో ముగుస్తుంది. అయితే ఇకపై పొడిగించరాదని సవరణ చేస్తూ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది కేంద్రం.
బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి రవిశంకర్
రాజ్యాంగంలోని 126వ సవరణ బిల్లు ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ల అంశంపై మరో పదేళ్లు పొడగిస్తూ బిల్లును పాస్ చేసింది ప్రభుత్వం. ఇక ఆంగ్లో ఇండియన్స్కు చట్ట సభల్లో చోటు కల్పించరాదంటూ పేర్కొనే సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ లోక్సభలో ప్రవేశపెట్టగా దీన్ని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుగతా రాయ్ వ్యతిరేకించారు. ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి ప్రాతినిథ్యం లేకుండా కేంద్రం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 296 మంది మాత్రమే యాంగ్లో ఇండియన్ కమ్యూనిటికీ చెందిన వారు ఉన్నారని కేంద్ర మంత్రి రవిశంకర్ చెప్పారు.
ప్రొవిజన్ పొడిగించేందుకు కేంద్రం నిరాకరణ
రాజ్యాంగంలోని ఆర్టికల్ 334లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించిన ప్రొవిజన్లు ఉండగా అదే ఆర్టికల్లో చట్ట సభల్లో ఆంగ్లో ఇండియన్స్ను నామినేట్ చేయాలనే ప్రొవిజన్ కూడా ఉంది. ఇది వచ్చే ఏడాది జనవరి 25కు ముగియనుంది. ఒకవేళ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను పదేళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లుగా డెసిషన్ తీసుకోకపోతే ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ నుంచి చట్టసభలకు ప్రాతినిథ్యం ఉండదని బిల్లులో పొందుపర్చారు. ఇక ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోవాలనేది రాజ్యాంగం రాసిన మేధావుల కోరికని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అదే సమయంలో ఆంగ్లో ఇండియన్స్ పొడిగింపునకు సంబంధించి ప్రొవిజన్లో ఎలాంటి కారణాలు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్రపతికి లేఖ
ఇదిలా ఉంటే చట్టసభల్లో ఆంగ్లో ఇండియన్స్ ప్రాతినిథ్యాన్ని నిలిపివేస్తూ తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ హిబీ ఈడెన్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు లేఖ రాశారు. దేశాభివృద్ధిలో ఆంగ్లో ఇండియన్స్ కృషి కూడా ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. వారి జనాభాకు చట్టసభల్లో ప్రాతినిథ్యం కల్పించాలని కోరారు. వారి సామాజిక స్థితిగతులు మెరుగు పడలేదని చెప్పిన హిబీ ఈడెన్ చట్టసభల్లో వారి రిజర్వేషన్ కొనసాగేలా చూడాలని లేఖలో పేర్కొన్నారు.
ప్రధానికి లేఖ రాసిన ఆలిండియా ఆంగ్లో ఇండియన్ అసోసియేషన్
మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు ఆలిండియా ఆంగ్లో -ఇండియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చీఫ్ బ్యారీ ఓ బ్రెయిన్. రాజ్యాంగ సవరణ చేయాలన్న కఠిన నిర్ణయం ప్రభుత్వం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఉన్నఫలంగా దీనిపై నిర్ణయం తీసుకోవడం ఆంగ్లో ఇండియన్ సమాజాన్ని బాధకు గురిచేసిందని చెప్పారు. అదికూడా ఒక్క ఆంగ్లో ఇండియన్ నాయకుడిని కూడా సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు బ్యారీ ఓ బ్రెయిన్. అంతేకాదు చట్టసభల్లో ఆంగ్లో ఇండియన్స్కు ప్రాతినిథ్యం కల్పించకపోవడానికి ముందు తమకు ఎలాంటి న్యాయం చేయకపోవడం మరింది ఆవేదనకు గురిచేస్తోందని ప్రధాని మోడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు బ్యారీ ఓ బ్రెయిన్.