ప్రధాని మోడీకి లేఖ రాసిన 49 మంది సెలబ్రిటీలు.. వీరేం కోరుకుంటున్నారు..?
దేశంలో సామూహిక దాడులు జరుగుతున్న నేపథ్యంలో 49 మంది సెలబ్రిటీలు ప్రధాని మోడీకి లేఖ రాశారు. సామూహిక దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని వారు లేఖలో కోరారు. అంతేకాదు జైశ్రీరాం నినాదంతోనే ఇతర మతాలకు చెందిన వారిపై దాడులు జరుగుతున్నాయని లేఖలో ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. భారత్లో అత్యధికమంది శ్రీరాముడిని పూజిస్తారని అలాంటి దేవుడి పేరుతో దాడులు జరగడాన్ని వారంతా ఖండించారు. శ్రీరాముడి పేరును దాడులు చేసి భ్రష్టు పట్టిస్తున్నారని సెలబ్రిటీలు ప్రధానికి తెలిపారు.
ముస్లింలపై, దళితులపై ఇతర వెనకబడిన వర్గాలవారిపై సామూహిక దాడులు చేయడం తగదని సూచించిన సెలబ్రిటీలు దీనికి వెంటనే చెక్ పెట్టాలని ప్రధానిని కోరారు. ఒక్క 2016 సంవత్సరంలోనే దళితులపై 840 దాడులు జరిగినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వెల్లడించిన గణాంకాలు చూసి షాక్ అయ్యామని సెలబ్రిటీలు చెప్పారు. అంతేకాదు 2009 జనవరి 1 నుంచి 2018 అక్టోబర్ 29 వరకు మతం పేరుతో జరిగిన దాడులు 254 అని చెప్పారు. ఈ దాడుల్లో 91 మంది ప్రాణాలు కోల్పోగా 579 మంది గాయపడినట్లు గణాంకాలు చెబుతున్నాయని ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు.
సామూహిక దాడులను పార్లమెంటులో ఖండించడం వల్ల ఒరిగేదేమీ లేదని దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కఠిన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు సెలబ్రిటీలు. అయితే జైశ్రీరాం నినాదం దాడుల కోసం వినియోగించడం చాలా బాధగా ఉందని చెప్పారు. ఆ నినాదం పేరుపైనే దాడులు జరగడం కలచివేస్తోందని అది దురదృష్టకరమని సెలబ్రిటీలు చెప్పారు. నిరసనలలేని ప్రజాస్వామ్యం అంటూ ఉండదని చెప్పిన సెలబ్రిటీలు.. నిరసనలు తెలియజేస్తే వారిపై జాతి వ్యతిరేక ముద్ర వేయరాదని ప్రధాని మోడీని కోరారు సెలబ్రిటీలు.
లేఖ రాసి సంతకంపెట్టిన వారిలో ప్రముఖ సినీ దర్శకులు అదూర్ గోపాల్ కృష్ణన్, మణిరత్నం, అనురాగ్ కశ్యప్, అపర్ణ సేన్, కొంకొన సేన్ శర్మ, సౌమిత ఛటర్జీలు ఉండగా.... ప్రముఖ సామాజిక కార్యకర్తలు బినాయక్ సేన్, సౌమిత్రో ఛటర్జీ, రూవతి, శ్యాంబెనటల్, శుభ ముగ్దల్, రూపం ఇస్లాం, అనుపం రాయ్, పరంబ్రత, రిద్ది సేన్లు కూడా ఉన్నారు. మరోవైపు ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ, ఆషిష్ నందీలు కూడా లేఖపై సంతకం చేసిన వారిలో ఉన్నారు.