ఎంపీ-రాజస్థాన్: కాంగ్రెస్ పార్టీలో ప్రతిభకి చోటులేదు: జ్యోతిరాదిత్య సింధియాతో సచిన్ పైలట్ భేటీ!
న్యూఢిల్లీ: రాజస్థాన్ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై మధ్యప్రదేశ్కు చెందిన బీజేపీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ మాజీ నేత జ్యోతిరాదిత్య సింధియా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజస్థాన్ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ను ఉద్దేశించి ట్విట్టర్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు.
కాంగ్రెస్ పార్టీలో ప్రతిభకు గుర్తింపు లేదు
పార్టీ(కాంగ్రెస్) పరంగా పక్కనపెట్టడమే గాక, సీఎం అశోక్ గెహ్లాట్ నుంచి తన మాజీ సహచరుడు(సచిన్ పైలట్) వేధింపులు ఎదుర్కోవడం చూస్తుంటే బాధగా ఉందని సింధియా వ్యాఖ్యానించారు. ప్రతిభకీ, సామర్థ్యానికి కాంగ్రెస్ పార్టీలో తగిన గుర్తింపు లేదని ఘాటుగా స్పందించారు.
ఎమ్మెల్యేలతో ఢిల్లీలో సచిన్ పైలట్..
ప్రస్తుతం రాజస్థాన్ రాజకీయాలు సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. సుమారు 20 మందికిపైగా ఎమ్మెల్యేలతో సచిన్ పైలట్ దేశ రాజధానికి వెళ్లారు. సీఎం గెహ్లాట్ వ్యవహారశైలి పడకపోవడంతో తనకు మద్దతునిచ్చే ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీలో మకాం వేశారు. కాంగ్రెస్ పెద్దలు సచిన్ పైలట్ ను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, సచిన్ పైలట్ వారికి సానుకూలంగా లేనట్లే తెలుస్తోంది. దీంతో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందంటూ కాంగ్రెస్ సీఎంతోపాటు నేతలు ఆరోపిస్తున్నారు.
Recommended Video
సింధియాతో పైలట్ భేటీ
కాగా, గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న జ్యోతిరాదిత్య సింధియా ఈ ఏడాది మార్చిలో 22 మంది ఎమ్మెల్యేలతోపాటు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. యువనేతగా ఉన్న జ్యోతిరాధిత్య సింధియాను పక్కనపెట్టి కమల్ నాథ్ కు సీఎం పదవి కట్టబెట్టడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. రాజస్థాన్ రాస్ట్రంలో కూడా సచిన్ పైలట్ కీలక నేతగా ఉన్నారు. అయితే, సీనియర్ నేత అయిన అశోక్ గెహ్లాట్కు కాంగ్రెస్ సీఎం పదవిని కట్టబెట్టింది. దీంతో వీరిద్దరి మధ్య తరచూ బేధాభిప్రాయాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల సీఎం గెహ్లాట్ పంపిన ఒక నోటీసుతో సచిన్ పైలట్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో ఢిల్లీకి వెళ్లారు. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సచిన్ పైలట్ సహకరిస్తారా? లేక సొంత పార్టీ ఏదైనా ప్రకటిస్తారా? అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఇది ఇలావుండగా, సచిన్ పైలట్.. బీజేపీ జ్యోతిరాదిత్య సింధియాను కలిసినట్లు వార్తలు వస్తుండటం మరింత ఉత్కంఠకు తెరలేపినట్లవుతోంది.