కళంకం తెస్తున్న అమీర్-షారుక్ , రెచ్చగొడితే..: సాధ్వీ
జంషెడ్పూర్: విశ్వహిందూ పరిషత్కు చెందిన సాధ్వి ప్రాచీ బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ల పైన మంగళవారం నాడు మరోసారి ధ్వజమెత్తారు. ఈ ఇద్దరు నటులతో పాటు ఎస్పీ నేత అజమ్ ఖాన్ భారత దేశానికి కళంకం తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
అసహనం పైన ఉద్దేశ్యపూర్వకంగా మాట్లాడుతున్నారని అభిప్రాయపడ్డారు. తద్వారా దేశానికి మచ్చ తెస్తున్నారన్నారు. జాతి వ్యతిరేకులు తమ అవార్డులను వెనక్కి ఇస్తున్నారన్నారు. అసహనం అనేది లేదని అభిప్రాయపడ్డారు.
అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, అజమ్ ఖాన్లు అసహనంపై మాట్లాడేది అవాస్తవమని చెప్పారు. వారు ఏఐసీసీ అధ్యక్షులు సోనియా గాంధీతో కలిసి చెడు పేరు తీసుకు వస్తున్నారని అన్నారు.
దాద్రీ ఘటన పైన మాట్లాడుతూ... హిందువులు ఎక్కడ కూడా మత ఘర్షణలను ప్రారంభించరని చెప్పారు. కానీ కొందరు ఉద్దేశ్య పూర్వకంగా ఆవులను చంపడం, బీఫ్ ఫెస్టివెల్ నిర్వహించడం ద్వారా రెచ్చగొడుతున్నారని, వాటిని హిందువులు సహించరన్నారు.
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కేసును సిబిఐకి ఎందుకు అప్పగించడం లేదని నిలదీశారు. సిబిఐకి అప్పగిస్తే నిజాలు బయటకు వస్తాయన్నారు. అయోధ్యలో రామమందిరంపై మాట్లాడుతూ... నరేంద్ర మోడీ ప్రధానిగా ఉండగానే రామాలయ నిర్మాణం జరుగుతుందన్నారు. ముస్లీం యువతులు బయటకు రావాలని అభిప్రాయపడ్డారు.