అజాంఖాన్ ఓ ఉగ్రవాది, జాతి వ్యతిరేకి: సాధ్వి ప్రాచి
న్యూఢిల్లీ: ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే వీహెచ్పీ మహిళా నేత సాధ్వీ ప్రాచి మరోసారి తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఈసారి ఉత్తరప్రదేశ్ మంత్రి, సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత అజాంఖాన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అజాంఖాన్ను ఉగ్రవాదిగా ఆమె పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి ఆమె శనివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అజాం ఖాన్ టెర్రరిస్ట్, జాతివ్యతిరేకి అంటూ ఆరోపించారు. అజాం ఖాన్ ప్రధాని కావాలని కలలు కంటున్నారని, ప్రధానమంత్రి కాదు కదా.. సెక్యురిటీగార్డు కూడా కాలేరని ఆమె ఎద్దేవా చేశారు.
అయోధ్యలో రామాలయాన్ని నిర్మించి తీరుతామని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇప్పటికే రామాలయానికి పునాది వేశామని, త్వరలోనే ఆలయ నిర్మాణ పనులు కూడా ప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు. గురువారం లక్నోలో ‘‘బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో అందరూ ఒక దరికి చేరారు. కుట్ర చేశారు. చివరకు సైన్యం కూడా చూస్తుండిపోయింది తప్ప ఆపే ప్రయత్నం చేయలేదు'' అని అజాం ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు.
అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసమంటూ విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) రెండు లారీల ఇటుకలను అక్కడికి తరలించిందన్న వార్తల నేపథ్యంలో ఆజాం ఖాన్ పైవ్యాఖ్యలు చేశారు. సైన్యం పేరును ప్రస్తావించడంతో ఆజం ఖాన్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా కలకలం రేపాయి.