ఔను.. నెహ్రూ క్రిమినలే.. ఆర్టికల్ 370 విధింపుపై శివరాజ్ కామెంట్స్ను సమర్థించిన సాద్వీ
భోపాల్ : ఆర్టికల్ 370 విధించిన పండిట్ నెహ్రూ క్రిమినల్ అని బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహన్ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ ఎంపీ సాద్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ సమర్థించారు. నెహ్రూ అనాలోచిత నిర్ణయం వల్లే 70 ఏళ్ల కశ్మీర్ వెనుకబాటునకు గురైందని విమర్శించారు. అక్కడ ఉగ్రవాదం పెరిగి, ప్రజల జీవన ప్రమాణస్థాయి తగ్గడానికి కారణం అప్పటి పాలకులేనని మండిపడ్డారు. నెహ్రూ చేసిన చారిత్రక తప్పిదాన్ని మోడీ సరిచేశారని ఈ సందర్భంగా గుర్తుచేశారు సాద్వీ.
ఈ నెల 11న మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ నెహ్రూపై కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ సభ్యత్వ నమోదు సందర్భంగా విరుచుకుపడ్డారు. అప్పటి వ్యాఖ్యలను సోమవారం సాద్వీ సమర్ధించారు. తన దేశ ప్రజలను సమానంగా చూడకుండా .. వివక్ష చూపిన వారు ఎంతటివారైనా శిక్షార్షులు అని స్పష్టంచేశారు సాద్వీ. అంతేకాదు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా .. కశ్మీర్ ప్రజల పాలిట నిజమైన దేశభక్తులని కొనియాడారు. ఆర్టికల్ 370 రద్దు చేసి వారికి మోక్షం కలిగించారన్నారు. అయితే ఆర్టికల్ 370 రద్దుపై కొందరు పసలేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్పై విరుచుకుపడ్డారు సాద్వీ. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ ప్రజలకు మేలు జరగుతుందని చెప్పారు. గత ఎన్నికల్లో భోపాల్ నుంచి దిగ్విజయ్ను సాద్వీ ఓడించిన సంగతి తెలిసిందే. దీనిని బట్టి భోపాల్ ప్రజలు తనను ఎందుకు ఎన్నుకున్నారో అర్థమవుతుందన్నారు. కుత, మతాలకతీతంగ దేశ ప్రయోజనాలు ఆశించి ఎంచుకున్నారని గుర్తుచేశారు.