డిగ్గీ రాజాపై పోటీకి సన్యాసిని సై: బీజేపీలో చేరిక: సీటు ఖరారు
భోపాల్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహారాష్ట్రలోని మాలేగావ్ బాంబు పేలుడు కేసు ఘటనలో ప్రధానంగా వినిపించిన పేరు సాధ్వి ప్రజ్ఞాసింగ్. ఈ కేసులో చాలాకాలం పాటు కారాగార శిక్షను అనుభవించిన ఆమె.. విడుదల అయ్యారు. రాజకీయ రంగప్రవేశం చేశారు. భారతీయ జనతాపార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. లోక్ సభ ఎన్నికల బరిలో నిల్చోవడానికి సిద్ధపడ్డారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి ఆమె లోక్ సభకు పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అధిష్ఠానం ఆమె పేరును ప్రకటించడం దాదాపు లాంఛన ప్రాయమే. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ భోపాల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రేసులో ఉన్న విషయం తెలిసిందే.
ఫోన్ కాల్స్, పోస్ట్ మార్టం కీలకం! బీటెక్ విద్యార్థిని జ్యోత్స్న కేసులో బిహారీ లెక్చరర్ హస్తం?
కాషాయ కండువా కప్పుకొన్న సాధ్వి..
బుధవారం ఉదయం ప్రజ్ఞాసింగ్ బీజేపీ కండువా కప్పుకొన్నారు. భోపాల్ లోని పార్టీ రాష్ట్రశాఖ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రభాత్ ఝా, నరోత్తమ్ మిశ్రా, రామ్ లాల్ లతో భేటీ అయ్యారు. సుమారు 45 నిమిషాలు పాటు ఆమె వారితో సమావేశం అయ్యారు. అనంతరం- విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. మంగళవారమే తాను బీజేపీలో ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకున్నట్లు చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నానని అన్నారు. పార్టీ ఆదేశిస్తే.. ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యంతరమేదీ లేదని అన్నారు. తాను పోటీ చేయడం ఖాయమని, గెలుస్తానని కూడా ప్రజ్ఞాసింగ్ ధీమా వ్యక్తం చేశారు.
మాలెగావ్ బాంబు పేలుడు ప్రధాన సూత్రధారిగా..
ప్రజ్ఞాసింగ్ కు హిందుత్వ అతివాదిగా గుర్తింపు ఉంది. 2008 సెప్టెంబర్ 29వ తేదీన మహారాష్ట్రలోని మాలేగావ్ బాంబు పేలుడులో ఆమె ప్రధాన సూత్రధారి అని ఆరోపణలు వచ్చాయి. ఆ పేలుడులో ఆరుమంది దుర్మరణం పాలయ్యారు. సుమారు వందమందికి పైగా గాయపడ్డారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆమెను అరెస్టు చేసింది. చాలాకాలం పాటు ప్రజ్ఞాసింగ్ జైలు జీవితాన్ని గడిపారు. ఈ సందర్భంగా ఆమె చిత్రహింసలకు గురయ్యారని అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. సుమారు ఎనిమిదేళ్ల పాటు ఆమె జైల్లో గడిపారు. ఈ కేసులో నిర్దోషిగా విడుదల అయ్యారు. జైలు నుంచి విడుదలైన తరువాత.. కొద్దిరోజుల పాటు బాహ్యప్రపంచానికి దూరంగా గడిపారు. తాజాగా బీజేపీలో చేరి, మరోసారి వార్తల్లోకి ఎక్కారు.
సంఘ్ పరివార్ ఒత్తిళ్లు పనిచేశాయా?
హిందుత్వ అతివాదిగా గుర్తింపు పొందిన సాధ్వి ప్రజ్ఞాసింగ్ కు ముందు నుంచీ బీజేపీ అనుబంధ సంఘాలతో సాన్నిహిత్యం ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ప్రజ్ఞాసింగ్ విద్యార్థి దశలో ఆమె అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) లో పనిచేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో చురుకైన కార్యకర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె బీజేపీలో చేరడం, భోపాల్ వంటి కీలక మైన లోక్ సభ స్థానంలో టికెట్ ను ఆశించడం వెనుక.. సంఘ్ పరివార్ ఒత్తిళ్లు పనిచేశాయని అంటున్నారు. ప్రజ్ఞాసింగ్ కు లోక్ సభ టికెట్ ఇవ్వాలంటూ ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ వంటి సంఘాలు బీజేపీపై ఒత్తిడి తీసుకొచ్చాయని సమాచారం. బీజేపీ ఈ ఒత్తిళ్లకు తలొగ్గినట్లు చెబుతున్నారు.
శివరాజ్ సింగ్, ఉమాభారతిలను కాదని..
ఈ కారణం వల్లే భోపాల్ లో పోటీ చేసే అభ్యర్థి పేరును ఇప్పటికీ ప్రకటించలేదని తెలుస్తోంది. కాంగ్రెస్ తమ పార్టీ అభ్యర్థిగా దిగ్విజయ్ సింగ్ పేరును ఖరారు చేయడంతో.. బీజేపీ కూడా ధీటైన నాయకుడి కోసం అన్వేషించింది. పలువురి పేర్లను పరిశీలించింది. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మాజీమంత్రి ఉమా భారతి, కైలాష్ విజయ్ వర్గీయ, నరేంద్ర సింగ్ తోమర్, వీడీ శర్మ, విజేష్ లుణావత్, అలోక్ సంజర్ వంటి నాయకుల పేర్లపై చర్చించింది. అనూహ్యంగా సాధ్వి ప్రజ్ఞాసింగ్ పేరు తెర మీదికి వచ్చింది.