ఎన్జీవోల విరాళాలపై ఆంక్షలు సరికాదు: యూఎన్ మానవ హక్కుల హైకమిషనర్, ఇండియా కౌంటర్
జెనీవా/న్యూఢిల్లీ: స్వచ్ఛంద సంస్థ(ఎన్జీవో)లకు విదేశాల నుంచి అందే నిధులు/విరాళాలకు సంబంధించి భారత్ అమలు చేస్తున్న ఆంక్షలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ మిచెల్ బాచిలెట్ ఆందోళన వ్యక్తం చేశారు. మానవ హక్కుల కార్యకర్తల అరెస్టులు కూడా తమను ఆవేదనకు గురిచేస్తున్నాయి. వ్యాఖ్యానించారు. దీనిపై భారత్ కూడా ఘాటుగా స్పందించింది.
భారత్ దీర్గకాలంగా బలమైన పౌర సమాజంగా గుర్తింపు పొందింది. దేశీయంగా, అంతర్జాతీయంగా మానవ హక్కుల పరిరక్షణకు విశేష కృషి చేసింది. కానీ, ఇటీవల ఆదేశంలో కొన్ని అనిశ్చిత చట్టాలు అమల్లోకి వచ్చాయి. మానవ హక్కుల కోసం పోరాడే గొంతుకలను నొక్కేస్తున్నాయని మిచెల్ బాచిలెట్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఎన్జీవోలకు ఇతర దేశాల నుంచి వస్తున్న నిధులను అడ్డుకోవడం సరికాదన్నారు. ఎన్జీవోలు, మానవ హక్కుల కార్యకర్తల హక్కులను పరిరక్షించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆమె విజ్ఞప్తి చేశారు. మిషెల్ వ్యాఖ్యలపై విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ ఘాటుగా స్పందించారు.
శ్రీవాస్తవ ఢిల్లీలో మాట్లాడుతూ.. చట్టాల రూపకల్పనపై భారత్ సార్వభౌమాధికారం కలిగి ఉందని స్పష్టం చేశారు. మానవ హక్కుల ఉల్లంఘనల ముసుగులో చట్టాలను ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఈ విషయంపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం మరింత అవగాహనతో స్పందించాల్సిన అవసరం ఉందని హితవు పలికారు.
Recommended Video
మానవ హక్కుల రక్షణ కోసం భారతదేశంలో స్వతంత్ర న్యాయవ్యవస్థ, జాతీమ మానవ హక్కుల సంఘం ఉందని వివరించారు. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎఫ్సీఆర్ఏ) స్పందించే అధికారం ఐక్యరాజ్యసమితికి లేదని తేల్చి చెప్పారు. ఎఫ్సీఆర్ఏ చట్టాన్ని ఇటీవల భారత ప్రభుత్వం మరింత కఠినతరం చేసిన విషయం తెలిసిందే. కాగా, నిబంధనలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించడంతో అమ్నేస్టీ ఇంటర్నేషనల్ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడంతో ఆ సంస్థ ఇండియాలో తన కార్యాలయాలను మూసివేసిన విషయం తెలిసిందే.