కోవిడ్ వ్యాక్సిన్ తయారీలో ఒత్తిడి ఉన్నా భద్రత,నాణ్యతలో రాజీ పడేది లేదు : భారత్ బయోటెక్ సిఎండీ
తెలంగాణ రాష్ట్రం నుండే కరోనా వైరస్ కు తొలి వ్యాక్సిన్ వస్తుందని, దీని కోసం దేశం మొత్తం హైదరాబాద్ వైపే చూస్తోందని ఐఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్న విషయం తెలిసిందే. హైదరాబాద్ కు చెందిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ సంస్థ నుండి కరోనా వైరస్ కు తొలి వ్యాక్సిన్ రూపొందుతుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేసిన వారం రోజులు గడవక ముందే భారత్ బయోటెక్ సంస్థ కరోనా వ్యాక్సిన్ తయారీపై కీలక విషయాలు వెల్లడించింది.
Recommended Video
అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలతో కోవిడ్ వ్యాక్సిన్ : భారత్ బయోటెక్ చైర్మన్ & ఎండీ
కోవిడ్ వ్యాక్సిన్ ను త్వరగా అభివృద్ధి చేయాలని ఒత్తిడి ఉన్నప్పటికీ , భద్రత ,నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని కోవిడ్ వ్యాక్సిన్ పై చెన్నై ఇంటర్నేషనల్ సెంటర్ సభ్యులతో జరిగిన చర్చలో భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్ల ఈ విషయం తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ ను అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలతో, సురక్షితంగా, అందుబాటు ధరలో ఆవిష్కరిస్తామని పేర్కొన్న ఆయన అత్యున్నత ప్రమాణాలతోనే క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఒత్తిడి ఉంది .. కానీ హడావిడిగా వ్యాక్సిన్ తీసుకురాలేం
అంతర్జాతీయ సంస్థలు కూడా తమ పని తీరును పరిశీలిస్తున్నాయని అన్నారు. ప్రపంచ గుర్తింపు పొందిన ఫార్మా సంస్థలతో పోటీగా ఇండియా ఈ వ్యాక్సిన్ తయారీ చేస్తుందని ఆయన అన్నారు . ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కోవిడ్ వ్యాక్సిన్ ఆవిష్కరణ దేశానికి ఎంతో ప్రతిష్ఠాత్మక అంశంగా మారిందని, ఒత్తిడి ఉన్నప్పటికీ, హడావిడిగా వ్యాక్సిన్ ను తీసుకురామని , ప్రజల ప్రాణాల రక్షణ దృష్టిలో పెట్టుకొని, అందుబాటు ధరలో ఉండేవిధంగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొస్తామని పేర్కొన్నారు భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్ల.
సాంకేతికత , క్లినికల్ ట్రయల్స్ లో చైనా కంటే ముందే ఉన్న భారతీయ కంపెనీలు
కోవ్యాక్సిన్ తొలి దశ పూర్తి కేవలం 30 రోజులు పట్టింది అన్న ఆయన ఇప్పుడు రెండో దశ పరీక్షలలోకి ప్రవేశించామని పేర్కొన్నారు. చాలా మందికి భారతీయ కంపెనీల సామర్ధ్యం విషయంలో అనుమానాలున్నాయని, సాంకేతికత , క్లినికల్ ట్రయల్స్ విషయంలో చైనా కంటే భారతీయ కంపెనీలు ఎంతో ముందున్నాయని ఆయన అన్నారు. గతంలో రోటా వైరస్ , పోలియో మరికొన్ని వ్యాధులకు వ్యాక్సిన్ తో సమాధానం చెప్పామని ఆయన గుర్తు చేశారు .
వ్యాక్సిన్ ఆవిష్కరణ తేదీ చెప్పటానికి నిరాకరణ
కరోనా వైరస్ కారణంగా మరణాలు సంభవించడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోందని పేర్కొన్న ఆయన, ఇప్పుడు దేశం మొత్తం కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తోందని తెలిపారు. త్వరితగతిన కోవిడ్ వ్యాక్సిన్ ను ఆవిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని చెబుతున్న ఆయన వ్యాక్సిన్ ఆవిష్కరణ తేదీ మాత్రం వెల్లడించడానికి నిరాకరించారు. మొత్తానికి అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలతో, అందరికీ అందుబాటు ధరలో ఉండేవిధంగా కోవిడ్ వ్యాక్సిన్ ఉండబోతుందని భారత్ బయోటెక్ సంస్థ చైర్మన్ వెల్లడించారు.