రష్యా వ్యాక్సిన్ సురక్షితమా? అనేది ముఖ్యం: ఎయిమ్స్ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: రష్యా అభివృద్ధి చేసిన 'స్పుత్నిక్ వీ' వ్యాక్సిన్పై ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాక్సిన్ వాడే ముందుగా సురక్షితమైనదా? ప్రపంచస్థాయి ప్రమాణాలను కలిగివుందా? అనేది పరిశీలించాల్సి ఉందని వ్యాఖ్యానించారు.
మొదట ఈ వ్యాక్సిన్ సురక్షితమైనదా? అనేది వెల్లడి కావాల్సి ఉందని, పెద్ద ఎత్తున వ్యాక్సిన్ ఉత్పత్తి చేపట్టేముందు ఇది ప్రాథమిక అంశమని డాక్టర్ రణ్దీప్ గులేరియా తెలిపారు. వ్యాక్సిన్ పరీక్షల శాంపిల్ పరిణామం, దీని సామర్థ్యం వంటి ప్రాతిపదికన భద్రతను పసిగట్టవచ్చని చెప్పారు.
వ్యాక్సిన్తో అభివృద్ధి చెందిన యాంటీబాడీలు ఎంతకాలం కొనసాగుతాయనేది కూడా పరిగణలోకి తీసుకోవాలని గులేరియా అన్నారు. ప్రపంచంలోనే తొలిసారిగా కరోనా వ్యాక్సిన్ను మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గులేరియా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
భారత వ్యాక్సిన్లు రెండు, మూడవ పరీక్షల దశలో ఉన్నాయని వెల్లడించారు గులేరియా. కరోనా వ్యాక్సిన్ల అభివృద్ధిపై భారత్ కసరత్తు సాగిస్తోందని, భారీగా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం మనకు ఉందని ఆయన స్పష్టం చేశారు.
రష్యా వ్యాక్సిన్లకు 20 దేశాల ఆర్డర్లు
ప్రపంచంలో అందరికంటే ముందు తాము కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తామని ఇప్పటికే రష్యా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రష్యా తీసుకొస్తున్న కరోనా వ్యాక్సిన్కు పేరును కూడా ఖరారు చేసింది. స్పుత్నిక్ వీ (Sputnik V) పేరుతో కరోనా వ్యాక్సిన్ను మార్కెట్లోకి తీసుకొస్తామని వెల్లడించింది.
స్పత్నిక్-ఐ ప్రపంచ వ్యాప్తంగా అంతరిక్ష పరిశోధనను ఉత్తేజపరిచింది. ఇక ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వచ్చే కరోనావైరస్ వ్యాక్సిన్ 'స్పత్నిక్'గా పిలువబడుతుంది. దీంతో ఇప్పుడు కూడా అదే మొదటి స్పుత్నిక్ సందర్భం వచ్చినట్లుంది. ఈ పోలికతోనే కరోనా వ్యాక్సిన్ పేరును 'స్పుత్నిక్ వీ'గా నిర్ణయించినట్లు సంబంధిత వెబ్సైట్ వివరించింది.
స్పుత్నిక్ వీకి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తామని సదరు వెబ్సైట్ పేర్కొంది. వ్యాక్సిన్కు సంబంధించి వచ్చే తప్పుడు వివరాలను ఈ వెబ్సైట్ ఖండిచడమేగాక, వాస్తవాలను వివరిస్తోంది. వ్యాక్సిన్ ప్రాజెక్టుకు నిధులను అందించే ది రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ హెడ్ కిరిల్ దిమిత్రీవ్ మాట్లాడుతూ.. బుధవారం నుంచి ఫేస్ 3 ట్రయల్స్ ప్రారంభమవుతాయని తెలిపారు. సెప్టెంబర్ నుంచి వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభమవుతుందని చెప్పారు.