త్రిపురలో బీజేపీ గెలుపు వెనుక..: ఆ నాలుగు కారణాలే సీపీఎంను దెబ్బకొట్టాయి?..
Recommended Video
అగర్తలా: రెండు దశాబ్దాలుగా త్రిపురను ఏకఛత్రాధిపత్యంతో ఏలుతూ వచ్చిన సీపీఎం పాలనకు బీజేపీ బ్రేక్ వేసింది. మాణిక్ సర్కార్ నేత్రుత్వంలోని సీపీఎం పార్టీని వెనక్కి నెట్టి స్పష్టమైన మెజారిటీ దక్కించుకుంది బీజేపీ. ఇప్పటికే అస్సాం, మణిపూర్ రాష్ట్రాల్లో పాగా వేసిన బీజేపీ ఇప్పుడు త్రిపురను కూడా హస్తగతం చేసుకుని ఈశాన్య రాష్ట్రాల్లో మరింత పట్టు పెంచుకుంది.
'ఈశాన్య' ఫలితాలు: కమలం దెబ్బకు త్రిపుర ఎర్రకొట బద్దలు, 2 రాష్ట్రాల్లో బీజేపీ, ఖాతా తెరవని కాంగ్రెస్
మార్పు కోరుకున్నారు:
25ఏళ్ల సీపీఎం సుదీర్ఘ పాలనను చూసిన త్రిపుర ప్రజలు మార్పు కోరుకున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే త్రిపురలో అత్యధికంగా 91శాతం ఓటింగ్ నమోదవగా.. ఇందులో ఎక్కువ శాతం యువత బీజేపీకే ఓటు వేసినట్టు చెబుతున్నారు.
పొత్తు కలిసొచ్చింది..:
2013లో త్రిపురలో 50 స్థానాల్లో పోటీ చేస్తే 49 స్థానాల్లో బీజేపీ డిపాజిట్ గల్లంతయింది. అలాంటిది ఈ ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీతో అధికారాన్ని చేజిక్కించుకోవడం విశేషం.
తాజా ఎన్నికల్లో ఇండిజీనియస్ పీపుల్స్ ఫ్రంట్ జతకట్టడం(ఐపీఎఫ్టీ)తో జతకట్టిన బీజేపీ.. 35పైచిలుకు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. గిరిజన పార్టీ అయిన ఐపీఎఫ్టీతో పొత్తు గిరిజన, గిరిజనేతర ఓట్లను చీల్చిందని చెబుతున్నారు.
2013లో సీపీఎం 20ఎస్టీ స్థానాలకు గాను 18 స్థానాలు గెలుచుకోగా.. ఐపీఎఫ్టీతో పొత్తు కారణంగా అందులో కొన్ని స్థానాలు ఇప్పుడు బీజేపీ ఖాతాలోకి వెళ్లినట్టు చెబుతున్నారు.
క్షేత్రస్థాయిలో ఆర్ఎస్ఎస్ ప్రచారం:
గత మూడేళ్లుగా క్షేత్ర స్థాయిలో ఆర్ఎస్ఎస్ చేసిన కార్యాచరణ కూడా బీజేపీ గెలుపుకు కారణంగా చెబుతున్నారు. త్రిపురలో ఇంటింటికి తిరిగి ఆర్ఎస్ఎస్ చేసిన ప్రచారం ప్రజలను బాగానే ప్రభావితం చేసిందంటున్నారు.
అలాగే గడిచిన మూడేళ్లలో పలువురు కేంద్రమంత్రులు చాలాసార్లు త్రిపుర వెళ్లి మోడీ ప్రభుత్వ పథకాల గురించి, అభివృద్ది గురించి ప్రచారం చేస్తూ వచ్చారు. ఎన్నికల నాటికి మోడీ, అమిషాలు కూడా రంగంలోకి దిగడంతో బీజేపీ గెలుపు మరింత సులువైందంటున్నారు.
సమస్యలను ఎత్తిచూపడం..:
త్రిపురలోని పలు ప్రజా సమస్యలను బీజేపీ ఎత్తిచూపడం కూడా అక్కడి ప్రజలను ఆకట్టుకుందంటున్నారు. ప్రధానంగా నిరుద్యోగం, అవినీతి విషయాల్లో త్రిపుర సర్కార్ విఫలమైందన్న విమర్శలున్నాయి.
లేబర్ బ్యూరో డేటా ప్రకారం.. దేశంలో అత్యధికంగా 19.7శాతం నిరుద్యోగం త్రిపురలో ఉంది. బీజేపీ ఎన్నికల ర్యాలీల్లో ఈ సమస్యను హైలైట్ చేయడం ఆ పార్టీకి కలిసొచ్చింది. సీపీఎం సుదీర్ఘ పాలనలో నిరుద్యోగల సంఖ్య 25వేల నుంచి 7.33లక్షలకు పెరిగిందని, ఇదే ఆ పార్టీ సాధించిన ఘనత అని బీజేపీ ప్రచారం చేసింది.
ఈ ప్రచారం అక్కడి ప్రధాన సామాజిక వర్గమైన గిరిజన యువతను బాగా ఆకర్షించింది. మోడీని అభివృద్దికి మారుపేరుగా ప్రచారం చేయడం కూడా వారిని ఆకట్టుకుంది. దీనికి తోడు బీజేపీ సోషల్ మీడియా క్యాంపెయిన్ కూడా యువతను పెద్ద ఎత్తున ఆకర్షించింది. వెరసి త్రిపురలో బీజేపీ పాగా వేయగలిగింది.