ఉద్యోగులకు జీతాలివ్వాలి: మిగులు నిధిని విడుదల చేయాలని కోర్టుని కోరిన సహారా
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్ధానం ఆదేశంచినట్లుగా రూ. 5వేల కోట్లు సమీకరించి డిపాజిట్ చేస్తామని, ముందుగా కోర్టు ఆధీనంలో ఉన్న మిగులు నిధిని విడుదల చేయాలని సహారా గ్రూప్ అభ్యర్ధించింది. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాల్సి ఉందని, మరికొన్ని కార్పోరేట్ అప్పులు కూడా ఉన్నాయని పేర్కొంది.
ఈ మేరకు కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేస్తూ, ఆస్తులను విక్రయించే ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలోనే నిధుల సమీకరణ పూర్తవుతుందని వెల్లడించింది. సుబ్రతోరాయ్తో పాటు ఇద్దరు డైరెక్టర్లను విడుదల చేసేందుకు గాను మార్చి 24న కోర్టు 90 రోజుల సమయాన్ని మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
ఈ లోగా డబ్బు కట్టకుంటే విదేశాల్లోని మూడు హోటల్స్తో పాటు, దేశీయంగా ఉన్న ఆస్తులను విక్రయ బాధ్యతలు తామే స్వీకరిస్తామని సుప్రీం కోర్టు హెచ్చిరించిన సంగతి తెలిసిందే. తాజా పిటషన్ను విచారణకు స్వీకరించిన జస్టిస్ ఠాకూర్ నేతృత్వంలోని కమిటీ కేసుని మే 8కి వాయిదా వేశారు.
సహారా గ్రూప సంస్ధలకు చెందిన రెండు కంపెనీలు పెట్టుబడిదారులకు చెల్లించాల్సిన రూ. 24,000 కోట్లను చెల్లించకపోవడంతో గతేడాది మార్చి 4న అపెక్స్ కోర్టు సహారా ఛీప్ సుబ్రతారాయ్ తో పాటు ఇద్దరు కంపెనీ డైరెక్టర్లను అరెస్టు చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.
మార్చి 4 నుంచి సుబ్రతారాయ్ జైలులోనే కాలం గడుపుతున్నారు. ఆయనకు బెయిల్ మంజూరు చేయాలంటో సహారా గ్రూప్, సుప్రీం కోర్టుకు రూ. 5,120 కోట్లను డిపాజిట్ చేయాల్సి ఉంది.