సాయిబాబాపై స్వరూప వ్యాఖ్య: జోక్యానికి సుప్రీం నో
న్యూఢిల్లీ: షిరిడీ సాయిబాబా పైన ద్వారకా పీఠాధిపతి శంకరాచార్య చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పైన జోక్యానికి సుప్రీం కోర్టు సోమవారం నిరాకరించింది. తమ మనోభావాలు దెబ్బతింటే సాయిబాబా భక్తులు ఎవరి మీదైనా కేసులు పెట్టవచ్చునని వ్యాఖ్యానించింది. మనోభావాలు దెబ్బతిన్నాయని భావిస్తే వారు శంకరాచార్యపై సివిల్, లేక, క్రిమినల్ కేసు దాఖలు చేసుకోవచ్చునని సూచించింది.
షిరిడీ సాయిపై శంకరాచార్య చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను కేంద్రం అడ్డుకునేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీం కోర్టులోలో నెల క్రితం సాయిధామ్ చారిటబుల్ ట్రస్టు పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం పైవిధంగా స్పందించింది.
షిర్డీ సాయిబాబా పైన ఎవరు కూడా కించపరిచే వ్యాఖ్యలు చేయకుండా నిరోధించేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సాయిధామ్ ఛారిటబుల్ ట్రస్ట్ నాడు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సాయిధామ్ ఛారిటబుల్ ట్రస్ట్ షిర్డీ సాయిబాబా ఆలయం సహా మహారాష్ట్రలో అనేక ఆలయాలను నిర్వహిస్తోంది.
ఈ ట్రస్ట్ బుధవారం సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి, ఆయన అనుచరులు సాయిబాబా పైన ఎలాంటి ప్రకటనలు చేయకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో విజ్ఞప్తి చేసింది. దేశంలో ఎక్కడా ఏ ఆలయంలో నుంచీ వారు బాబు ప్రతిమలను తొలగించకుండా చూడాలని కోరింది.
బాబాకు వ్యతిరేకంగా స్వామి స్వరూపానంద సరస్వతి, ఆయన అనుచరులు కించపరిచే, అవమానకర పదజాలం వాడారని, వారి వ్యాఖ్యలతో దేశ, విదేశాల్లో ఉనన కోట్లమంది బాబా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొంది. ఈ విషయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోలేదని తప్పుబట్టింది. దీని పైన సుప్రీం నేడు స్పందించింది.
కాగా, సాయిబాబా దేవుడు కాదని, సాయిబాబా ఓ ముస్లిం అంటూ ద్వారకాపీఠాధిపతి శంకరాచార్యులు స్వరూపానంద సరస్వతి కొద్ది రోజుల క్రితం చేసిన విషయం తెలిసిందే. ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పలువురు కోర్టుకు కూడా ఎక్కారు.
లక్షలాది మంది భక్తుల మనోభావాలను గాయపరిచారంటూ లక్నోలోని సాయి ఆలయ అథారిటీ నాడు అలహాబాద్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. భక్తుల మనోభావాలను గాయపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు స్వరూపానంద సరస్వతిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పిల్లో కోరారు.
షిరిడీ సాయిబాబా దేవుడు కాదని, ఆయనను పూజించడం తప్పంటూ శంకరాచార్య చేసిన వ్యాఖ్యలు సాయిబాబా భక్తులకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. ఈ క్రమంలో ఇప్పటికే పలుచోట్ల ఆయనపై భక్తులు పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు. షిర్డీ సాయిబాబా దేవుడు కాడని, సాయిబాబాకు పూజలు చేయవద్దని స్వరూపానంద సరస్వతి సూచించారు.
సాయిబాబా తనకు తాను ముస్లింగా చెప్పుకున్నారని, అలాంటపుడు ఆయన విగ్రహానికి గంగానదిలో పదేపదే స్నానాదికాలు చేయించడమెందుకని ప్రశ్నించారు. తాను హిందూమత రక్షణ కోసం ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పారు. తనను జైలుకు పంపించినప్పటికీ తాను హిందూమతం కోసం ప్రచారం చేస్తానని చెప్పారు. తాను జైలుకు వెళ్లినా, తన దిష్టిబొమ్మలను దగ్ధం చేసినా తాను హిందూమతం కోసమే తాపత్రయపడతానన్నారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర వివాదం రేపాయి.