సాయి జన్మభూమి వివాదం .. షిరిడీ బంద్ కొనసాగినా ఆలయం తెరచే ఉంటుంది : షిరిడీ ఆలయ ట్రస్ట్
సాయి జన్మభూమి వివాదం మహారాష్ట్ర రాజకీయాల్లో పొలిటికల్ హీట్ పెంచుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం షిర్డీకి బదులు పత్రి గ్రామంలోని ఆలయాన్ని అభివృద్థి చేస్తామని చేసిన ప్రకటన నేపధ్యంలో షిర్డీలో ఆగ్రహ జ్వాలలు మిన్ను ముడుతున్నాయి. పత్రి ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు కూడా ఉద్దవ్ థాక్రే సర్కార్ విడుదల చెయ్యటంతో షిర్డీ వాసులు బంద్ కు పిలుపునిచ్చారు. మరాఠా సీఎం ఉద్దవ్ థాక్రే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రేపటి నుంచి బంద్ పాటించనున్నట్టు తెలిపారు. షిరిడీ ఆలయం కూడా మూసివేయ్యలని నిర్ణయం తీసుకున్నారు. అయితే షిరిడీ ఆలయం తెరిచే ఉంటుందని, బంద్ కొనసాగినా ఆలయం మూసివేయమని చెప్తున్నారు ఆలయ ట్రస్ట్ సభ్యులు .
సాయి జన్మభూమిపై మహా సర్కార్ రేపిన రగడ
దేశ నలుమూలల నుంచి మాత్రం కాకుండా విదేశాల నుంచి పెద్ద ఎత్తున దర్శించుకునే పవిత్ర పుణ్యక్షేత్రాలలో షిర్డీ సాయి బాబా ఆలయం ఒకటి. నిత్యం లక్షలాది మంది భక్తులు షిర్డీ సాయి నాధుని దర్శనం కోసం వెళ్తూ ఉంటారు. అలాంటి సాయినాధుని జన్మస్థలం విషయంలో మహారాష్ట్ర సర్కార్ తీసుకున్న నిర్ణయంతో వివాదం రేగింది. పర్భణీ జిల్లాలోని పత్రి అనే ఊరు సాయిబాబా జన్మస్థలమన్న ప్రచారం ఎప్పటినుంచో ఉంది. కానీ దీనిపై షిర్డీ గ్రామస్థులు అభ్యంతరం తెలుపుతున్నారు.
షిరిడీ కాకుండా పత్రి ఆలయ అభివృద్ధి ...మహా సర్కార్ నిర్ణయంతో షిరిడీ వాసుల ఆగ్రహం
అయితే పత్రి లోని ఆలయాన్నే అభివృద్ధి చేస్తామని మహారాష్ర్ట సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రేపటి నుంచి నగర నిరవదిక బంద్ కు పిలుపునిచ్చారు షిర్డీ వాసులు. దీంతో బాబా దర్శనానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. షిర్డీ వాసుల నిర్ణయంతో తమకు సంబంధం లేదంటున్నారు సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ నిర్వాహకులు. భక్తులు ఎవరూ కన్ఫ్యూజ్ కావద్దని స్వామీ దర్శనానికి రావొచ్చని చెప్తున్నారు . షిర్డీలో బంద్ కొనసాగిన ఆలయం మాత్రం తెరిచే ఉంటుందంటున్నారు.
షిరిడీ ఆలయ మూసివేత వార్తలపై స్పందించిన ట్రస్ట్
షిర్డీ సాయిబాబా ఆలయం మూసివేస్తున్నట్టు వస్తున్న కథనాలపై భక్తులు ఆందోళన చెంద వద్దని ఆలయ ట్రస్ట్ సూచించింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని కూడా పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయంపై షిరిడీ గ్రామస్థులతో ఈరోజు సాయంత్రం చర్చిస్తామని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. షిర్డీ గ్రామస్థులు చేసే నిరసనకు ఆలయానికి సంబంధం లేదన్నారు. షిరిడీ సాయి నాధుని కోసమే ఆందోళన చేస్తున్నప్పటికీ ఆలయం మూసివేత నిర్ణయం సరైనది కాదని ట్రస్ట్ భావిస్తుంది .
ఆలయం తెరిచే ఉంటుందన్న ట్రస్ట్ ..సాయంత్రం గ్రామస్థులతో సమావేశం
షిర్డీ ఆలయం నిరవధికంగా మూసివేస్తున్నట్టు వార్తలు వస్తున్న నేపధ్యంలో వెంటనే స్పందించిన ట్రస్ట్ ఈ నిర్ణయం ప్రకటించింది.ప్రభుత్వం తీసుకునే ఇలాంటి నిర్ణయాల వల్ల షిర్డీ ఆలయానికి ఆదాయం తగ్గిపోతుందన్న భావన వ్యక్తం అవుతుంది . అనవసరమైన విభేదాలు సృష్టించేందుకే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందని షిర్డీ వాసులు ఆరోపిస్తున్నారు. అందుకే దీన్ని నిరసిస్తూ నిరవధికంగా ఆలయాన్ని మూసివేయాలని ప్రకటించారు. కానీ అలా కాకుండా ఆలయం తెరచి ఉంచే యోచనలో ఉన్నారు ట్రస్ట్ సభ్యులు .ఈ సాయంత్రం ట్రస్ట్ సభ్యులు షిర్డీ గ్రామస్థులతో చర్చల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.