కాశ్మీర్పై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు: ముషార్రఫ్ కాళ్లు పట్టుకోమంటూ శివసేన ఫైర్
శ్రీనగర్/ముంబై: కాశ్మీర్ అంశంపై కాంగ్రెస్ నేత సైఫుద్దీన్ సోజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ స్వాతంత్ర్యంపై పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ వైఖరికి ఆయన మద్దతు పలికారు. కాశ్మీర్ ప్రజలు పాకిస్థాన్లో కలవడానికి ఇష్టపడటం లేదు, వారు కోరుకునేది స్వాతంత్ర్యమేనని ముషారఫ్ అన్నారని, తాను కూడా అదే చెబుతున్నానని సోజ్ అన్నారు.
ఈ విషయాన్ని 2007లో ముషార్రఫ్ పాక్ మిలటరీ అధికారులతోనూ, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలోని కొందరితో పంచుకున్నారని చెప్పారు. అయితే, అది సాధ్యపడదనే విషయం తనకు తెలుసునని అన్నారు.
సైఫుద్దీన్ సోజ్ రచించిన 'గ్లింప్సెస్ ఆఫ్ హిస్టరీ అండ్ స్టోరీ ఆఫ్ స్ట్రగుల్'అనే పుస్తకం జూన్ 25న విడుదల కానున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తన పుస్తకం గురించి మాట్లాడుతూ.. కార్గిల్ యుద్ధంలో ఓడిన తర్వాత.. ముషార్రఫ్ తన లక్ష్యాన్ని చేరడంలో విఫలమయ్యారని అన్నారు.
ఆ తర్వాత కాశ్మీర్ ప్రజలు స్వాతంత్ర్యం కోరుకుంటున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వానికి వివరించే ప్రయత్నం చేశారని తెలిపారు. మాజీ ప్రధాని వాజపేయి కాలంలో జరిగిన లాహోర్ డిక్లరేషన్తో కాశ్మీర్ ప్రజల ఆశలు చిగురించాయని సోజ్ వ్యాఖ్యానించారు.
కాగా, సోజ్ వ్యాఖ్యలపై బీజేపీ, శివసేనలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. సైఫుద్దీన్ లాంటి నాయకులు ఈ విధంగా మాట్లాడటం సరికాదని అన్నారు. భారత ప్రతిష్టను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఉగ్రవాదుల కంటే సామాన్యులనే ఎక్కువగా చంపుతోందంటూ భారత సైన్యంపై కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ వివాదాస్పద వ్యాఖ్యలపైనా బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
పాకిస్థాన్ వెళ్లి, ముషార్రఫ్ కాళ్లు పట్టుకో: సోజ్పై శివసేన తీవ్ర ఆగ్రహం
కాశ్మీర్పై సోజ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై శివసేన తీవ్రంగా స్పందించింది. సోజ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమధానం చెప్పాలని డిమాండ్ చేసింది. సోజ్ వ్యాఖ్యలను కాంగ్రెస్ సమర్థిస్తుందో లేదో స్పష్టం చేయాలని శిసేన ప్రతినిధి మనీషా కాయండే అన్నారు.
'పాకిస్థాన్పై ముషార్రఫ్పై సోజ్కు అంత మమకారం ఉంటే.. ఆయన పాకిస్థాన్కు వెళ్లిపోతే మంచిది. పాక్ వలస వెళ్లి ముషార్రఫ్ కాళ్ల దగ్గర పనిచేసుకోండి' అంటూ ఆమె సూచించారు.
మాటమార్చిన సోజ్
ఇతర రాజకీయ పార్టీల నుంచి విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత సోజ్ మాటమార్చారు. కాశ్మీర్ సమస్య పరిష్కారానికి చర్చలే మార్గమని, సైనిక పరిష్కారం కాదని అన్నారు. కాశ్మీర్ అంశంపై పాకిస్థాన్తో భారత్తో చర్చలు జరపాలని సూచించారు.