కంచిలో కలకలం: రూ.2వేల కోట్ల ఆస్తులు, నిత్యానంద శిష్యులకు వార్నింగ్
కాంచీపురం మఠంలో కలకలం రేగింది.మఠాధిపతి కిడ్నాప్ అంటూ పోలీసుల కేసు, బెంగళూరులో క్షేమంగా ఉన్నానంటూ ఆయన ఫోన్, ఆస్తి కోసం మొదలియార్ల నాటకమని ఆరోపణలు.. ఈ పరిణామాలు ఆసక్తిని రేపాయి.
చెన్నై: కాంచీపురం మఠంలో కలకలం రేగింది. మఠాధిపతి కిడ్నాప్ అంటూ పోలీసుల కేసు, బెంగళూరులో క్షేమంగా ఉన్నానంటూ ఆయన పోలీసులకు ఫోన్, ఆస్తి కోసం మొదలియార్ల నాటకమని ఆరోపణలు.. కథలన్నీ కంచి చేరుతాయనే సామెతలా ఆది, సోమ వారాల్లో చోటు చేసుకున్న పరిణామాలు ఆసక్తిని రేపాయి.
కంచిలో ఓ మఠానికి చెందిన వ్యవహారం తమిళనాడులో రెండు రోజుల పాటు పెద్ద కలకలం రేపింది. సోమవారం సాయంత్రానికి కొత్త మలుపు తిరిగింది. కాంచీపురం పరమశివన్ వీధిలో తొండమండల మొదలియార్ సామాజిక వర్గానికి చెందిన పురాతనమైన జ్ఞానప్రకాశ మఠం ఉంది.
వంశపారంపర్యం నిర్వహణలో ఈ మఠం 232వ మఠాధిపతిగా 2008 నుంచి జ్ఞానప్రకాశ్ దేశిక పరమాచార్య స్వామి వ్యవహరిస్తున్నారు. ఈ మఠానికి రాష్ట్రవ్యాప్తంగా రూ.2వేల కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. బెంగళూరుకు చెందిన నిత్యానంద శిష్యులు రెండు నెలల క్రితం మఠానికి వచ్చి, సేవలో తరిస్తామన్నారు.
Recommended Video
మఠంలోని మరకత శివలింగానికి సహజంగా ఆచరించే పారంపర్యపూజ విధానాన్ని నిత్యానంద శిష్యులు మార్చారు. మఠంపై ఆధిపత్యానికి ప్రయత్నాలు చేసినట్లుగా స్థానికుల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. చర్చలు జరపాలని నిర్ణయించారు.
మొదలియార్ల సంఘంతో మఠాధిపతి సోమవారం చర్చలు జరపాల్సి ఉంది. అంతలోనే మఠాధిపతి అదృశ్యమయ్యారు. ఆదివారం సాయంత్రం మొదలియార్ల సంఘం నేతలు వెళ్లి చూడగా మఠం తలుపులు మూసి ఉన్నాయి. ఫోన్ స్విచాఫ్ చేసి ఉంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మఠాధిపతిని నిత్యానంద శిష్యులు కిడ్నాప్ చేసి ఉంటారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మఠంలో చోటు చేసుకున్న పరిణామాలను ఛేదించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఆదివారం మఠానికి బయట తలుపు వేసి ఉండగా, సోమవారం లోపల గడియ పెట్టి ఉన్నట్లు గుర్తించారు.
మఠం లోపల నిత్యానంద శిష్యులు ఉన్నట్లుగా ఇరుగుపొరుగు వారు గుర్తించారు. పోలీసులు అక్కడకు చేరుకొని వారిని విచారించారు. మూడు రోజుల్లో మఠాన్ని, మఠాధిపతిని అప్పగించాలని లేదంటే అరెస్టులు తప్పవని హెచ్చరించారు.
ఇంతలో మరో ట్విస్ట్. మఠాధిపతి కిడ్నాప్ అంటూ వార్తలు వచ్చాయి. వీటిని చూసిన మఠాధిపతి తాను బెంగళూరులో ఉన్నానని కాంచీపురం పోలీసులకు ఫోన్ చేశారు. నిత్యానంద శిష్యులను వెంటబెట్టుకొని ఇష్టపూర్వకంగానే బయలుదేరానని, బెంగళూరులో పూజల నిమిత్తం ఉన్నానని చెప్పారు. అంతేకాదు, మఠానికి చెందిన ఆస్తులను కాజేసేందుకు మొదలియార్ల సంఘం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఈ కిడ్నాప్ ఉదంతమని మఠాధిపతి పోలీసులకు చెప్పారని అంటున్నారు.
పారంపర్యానికి చెందిన ఈ మఠానికి సుమారు రూ.2వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని, వీటిని అపహరించేందుకు నిత్యానంద శిష్యులు కుట్ర పన్నినట్లుగా భావిస్తున్నామని మొదలియార్ సంఘం నేతలు చెబుతున్నారు. మఠం ఏ ఒక్కరి సొత్తు కాదని, మఠాన్ని తమ సంఘానికి లేదా ప్రభుత్వానికి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది.