నేను అసలైన ముస్లీం, ప్రవక్త యోగి: సాక్షి సంచలనం
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ఎంపీ సాక్షి మహారాజ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాక్షి తనను తాను అసలైన ముస్లీంగా చెప్పారు. మహమ్మద్ ప్రవక్త గొప్ప యోగి అన్నారు. ప్రవక్త గొప్ప యోగా నిపుణులని భావిస్తున్నానని చెప్పారు.
సూర్యుడు లేకపోతే ఎవరూ బతకలేరని, సూర్యుడికి మతతత్వం ఆపాదించేవాళ్లు సూర్యకాంతిని గ్రహించడం ఆపేయాలని వ్యాఖ్యానించారు.
జూన్ 21వ తేదీన ఎన్డీయే ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్న విషయం తెలిసిందే. దీని పైన పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు కూడా.
యోగా దినోత్సవం నాడు విద్యార్థులంతా తప్పక పాల్గొనాలన్న ప్రభుత్వం ఆదేశాలపై ముస్లీం లా బోర్డు సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది.
కాగా, ఉత్తర ప్రదేశ్ మంత్రి, సమాజ్ వాది పార్టీ సీనియర్ నేత అజమ్ ఖాన్కు భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు సాక్షి మహారాజ్ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎంపీ యోగి ఆదిత్యనాథ్కు అజమ్ ఖాన్ రంజాన్ ప్రార్థనలు చేయాలని సూచించాడు. దీనిపై సాక్షి మహారాజ్ ధీటుగా స్పందించారు.
గురువారం నాడు సాక్షి మాట్లాడుతూ... అజమ్ ఖాన్ తొలుత జై శ్రీరాం అనాలన్నారు. ఎప్పుడు నిజం మాట్లాడని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది అజమ్ ఖాన్ అని సాక్షి మహారాజ్ మండిపడ్డారు. యోగి ఆదిత్యనాథ్కు రంజాన్ నమాజ్ చేయాలని ఆఫర్ చేశాడని, అతను ముస్లీంలను తప్పుదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు.
మనమంతా భారతీయ సంస్కృతికి చెందిన వారమని చెప్పారు. మనలో ఎలాంటి విభేదాలు లేవని వారు అనుకుంటే, అల్లా, భగవాన్, దేవుడు అందరూ ఒక్కటేనని అనుకుంటే.. మనం అల్లా హో అక్బర్ అనవచ్చునని, అయితే అదే సమయంలో అజమ్ ఖాన్ జైశ్రీరాం అనగలరా అని సవాల్ చేశారు.
ఆయన జై శ్రీరాం అంటే తమకు అల్లా హో అక్బర్ అనేందుకు అభ్యంతరం లేదని అభిప్రాయపడ్డారు.
బీజేపీ ఎంపీ ఆదిత్య నాథ్ కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ.. సూర్య నమస్కారాలను వ్యతిరేకించే వారు సముద్రంలో మునగాలన్నారు. దానికి అజమ్ ఖాన్ గురువారం స్పందిస్తూ.. ఆదిత్య నాథ్ నమాజ్ చేయాలని, అప్పుడు ఆయన సరైన మార్గంలో పయనిస్తారన్నారు. దానికి సాక్షి మహారాజ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.