‘రాహుల్ ఓ పిచ్చోడు: మోడీ కృష్ణుడిలా ఆదుకున్నారు’
లక్నో: వివాదాస్పద వ్యాఖ్యలతో తరుచూ వార్తల్లో నిలిచే భారతీయ జనతా పార్టీ ఎంపి సాక్షి మహరాజ్ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీపై శుక్రవారం ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
‘రాహుల్గాంధీ ఓ పిచ్చోడు. రాజకీయాల్లో ఆయనకు ఏబీసీడీలు కూడా తెలియవు. గోధుమలు.. మొక్కజొన్నకు తేడా తెలియదుకానీ.. ఆయన రైతుల గురించి మాట్లాడుతున్నారు' అని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమ్రోలీ రత్నాపూర్ అనే గ్రామంలో జరిగిన ఓ సభలో విమర్శించారు.
మహాభారతంలో ద్రౌపదిని శ్రీకృష్ణుడు కాపాడినట్లుగా భూకంపంతో ధ్వంసమైన నేపాల్ను ప్రధాని నరేంద్ర మోడీ ఆదుకొన్నారని కొనియాడారు. నేపాల్లో భూకంపం వచ్చిన వెంటనే ఆలస్యంచేయకుండా మోడీ స్పందించారని అన్నారు. ద్రౌపది ఆపదలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు ఆదుకున్నట్లుగానే మోడీ చేశారని చెప్పారు.
ఉత్తరప్రదేశ్లోని అఖిలేశ్యాదవ్ ప్రభుత్వంపై కూడా సాక్షిమహరాజ్ ధ్వజమెత్తారు. ఉత్తరప్రదేశ్లో గూండారాజ్యం నడుస్తోందని ధ్వజమెత్తారు. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని అన్నారు. అకాలవర్షాలతో పంటలు కోల్పోయిన రైతులను ఆదుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయటంలేదని ఆరోపించారు.
కేంద్రం కోట్ల రూపాయలు ఇస్తున్నా అవి బాధితులకు చేరటంలేదు అని పేర్కొన్నారు. భారతదేశం నరేంద్ర మోడీ సారథ్యంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని అన్నారు. మోడీ ప్రధానిగా ఉండటం వల్లే సరిహద్దులో శాంతి నెలకొందని అన్నారు. మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని, ఆయన శ్రద్ధ గల కళ్లు దేశాన్ని కాపాడుతున్నాయని చెప్పారు.
కాగా, సాక్షి మహరాజ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ కూడా తీవ్రంగానే స్పందించింది. సాక్షిమహరాజ్ దిగజారుడుతనానికి ఆయన వ్యాఖ్యలు అద్దంపడుతున్నాయని కాంగ్రెస్ నేత అభిశేక్సింఘ్వీ విమర్శించారు.