అజమ్ ఖాన్ 'జైశ్రీరాం' అంటే మేం సిద్ధం: సాక్షి కౌంటర్
లక్నో: ఉత్తర ప్రదేశ్ మంత్రి, సమాజ్ వాది పార్టీ సీనియర్ నేత అజమ్ ఖాన్కు భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు సాక్షి మహారాజ్ కౌంటర్ ఇచ్చారు. ఎంపీ యోగి ఆదిత్యనాథ్కు అజమ్ ఖాన్ రంజాన్ ప్రార్థనలు చేయాలని సూచించాడు.
దీనిపై సాక్షి మహారాజ్ ధీటుగా స్పందించారు. గురువారం నాడు సాక్షి మాట్లాడుతూ... అజమ్ ఖాన్ తొలుత జై శ్రీరాం అనాలన్నారు.
ఎప్పుడు నిజం మాట్లాడని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది అజమ్ ఖాన్ అని సాక్షి మహారాజ్ మండిపడ్డారు. యోగి ఆదిత్యనాథ్కు రంజాన్ నమాజ్ చేయాలని ఆఫర్ చేశాడని, అతను ముస్లీంలను తప్పుదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు.
మనమంతా భారతీయ సంస్కృతికి చెందిన వారమని చెప్పారు. మనలో ఎలాంటి విభేదాలు లేవని వారు అనుకుంటే, అల్లా, భగవాన్, దేవుడు అందరూ ఒక్కటేనని అనుకుంటే.. మనం అల్లా హో అక్బర్ అనవచ్చునని, అయితే అదే సమయంలో అజమ్ ఖాన్ జైశ్రీరాం అనగలరా అని సవాల్ చేశారు.
ఆయన జై శ్రీరాం అంటే తమకు అల్లా హో అక్బర్ అనేందుకు అభ్యంతరం లేదని అభిప్రాయపడ్డారు. బీజేపీ ఎంపీ ఆదిత్య నాథ్ కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ.. సూర్య నమస్కారాలను వ్యతిరేకించే వారు సముద్రంలో మునగాలన్నారు. దానికి అజమ్ ఖాన్ గురువారం స్పందిస్తూ.. ఆదిత్య నాథ్ నమాజ్ చేయాలని, అప్పుడు ఆయన సరైన మార్గంలో పయనిస్తారన్నారు. దానికి సాక్షి మహారాజ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.