మోడీ గెలుపు: యశోదాబెన్ను ఊర్మిళాదేవితో పోల్చిన సాక్షి మహారాజ్
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ వున్నావో పార్లమెంటు సభ్యుడు సాక్షి మహారాజ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్కే పురం సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ సతీమణి యశోదాబెన్ను రామాయణంలో లక్ష్మణుడి భార్య ఊర్మిళాదేవితో పోల్చారు.
సార్వత్రిక ఎన్నికల్లో మోడీ ఘన విజయానికి కారణం యశోదాబెన్ అని సూత్రీకరించారు. రాముడితోపాటు లక్ష్మణుడు కూడా వనవాసం వెళ్లాడని, అయితే ఆ సమయంలో లక్ష్మణుడి భార్య వనవాసం వెళ్లకుండా తపస్సులో మునిగిపోయిందని తెలిపారు.
ఆమె తపస్సే లక్ష్మణుడికి శక్తినిచ్చిందని, తద్వారా యుద్ధంలో వీరోచితంగా పోరాడగలిగాడని సాక్షి మహారాజ్ వివరించారు. అదే విధంగా మోడీ విజయం వెనక యశోదాబెన్ ఉన్నారని పేర్కొన్నారు. ఢిల్లీ అభివృద్ధి బాధ్యతలు మోడీ స్వీకరిస్తారని, దేశాన్ని ఎలా నడిపిస్తున్నారో.. అలేగా ఢిల్లీని కూడా పురోగామి పథంలో తీసుకెళతారని సాక్షి మహారాజ్ చెప్పారు.
ఢిల్లీ సిఎం అభ్యర్థిని బిజెపి ఎంపిక చేస్తుందని చెప్పిన సాక్షి మహారాజ్.. బిజెపికి ఓట్లు గెలిపించాలని కోరారు. కాగా, గత సెప్టెంబర్ నెలలో ఆయన మాట్లాడుతూ.. మదర్సాలు ఉగ్రవాదులకు స్థావరాలుగా మారుతున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. మత సంబంధమైన పాఠశాలల్లో జాతీయతను పెంపొందించేలా భోదనలు జరగడం లేదని అన్నారు.