జీతాలు కాదు... అదే ముఖ్యం అంటున్న భారతీయ యువత: స్టడీ
న్యూఢిల్లీ: భారతీయ యువత జీతం కంటే ఉద్యోగ భద్రతే ముఖ్యం అని అభిప్రాయపడుతోందని ఆలివ్ బోర్డ్ అనే ప్రైవేట్ సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది. ఉద్యోగ భద్రత తర్వాత ఇటు పనిని అటు వ్యక్తిగత జీవితంను బ్యాలెన్స్ చేసే దిశగా ఉండాలని యువత కోరుకుంటోందని ఆ సర్వే వెల్లడించింది.
బ్యాంకింగ్ రంగం ప్రభుత్వ ఉద్యోగాలు
ఆలివ్ బోర్డు చేపట్టిన సర్వేలో ఎక్కువ మంది బ్యాంకింగ్ రంగంలో ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని వెల్లడించింది. దేశవ్యాప్తంగా 5వేల మంది యువత అభిప్రాయాలను ఈ సంస్థ సేకరించింది. ఇందులో 44.3శాతం మంది ఉద్యోగ స్థిరత్వం లేదా ఉద్యోగ భద్రతకే ఓటువేశారు. 36.7శాతం మంది ఉద్యోగంను వ్యక్తిగత జీవితంను బ్యాలెన్స్ చేసేలా ఉండేందుకు మొగ్గుచూపారు. ఇక మంచి జీతం ఉండాలని కేవలం 11.1శాతం మందే కోరుకున్నారు.
గ్రామాలు, చిన్న పట్టణాల్లో ఎక్కువగా ఉన్న యువత
ఆలివ్ బోర్డు చేసిన సర్వేలో 79శాతం మంది రెస్పాండెంట్లు రెండో శ్రేణి మూడో శ్రేణి నగరాలకు చెందినవారు కావడం విశేషం. భారతీయు యువత ఆకాంక్షల గురించి మాట్లాడినప్పుడు మొదటి శ్రేణి నగరాల్లో నివాసముంటున్నవారితో కాకుండా ఇతరులతో మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే మెజార్టీ యువత చిన్న పట్టణాల్లో గ్రామాల్లో నివసిస్తోందని చెప్పారు ఆలివ్ బోర్డు సీఈఓ అభిషేక్ పాటిల్. ఈ ప్రాంతాల్లో నివాసం ఉండేవారే ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేయాలనే కోరిక చాలా బలంగా ఉంటుందన్నారు.
ఒకేసారి మూడు పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న యువత
ఇక ఆలివ్ బోర్డు నిర్వహించిన సర్వేలో 23శాతం మంది మాక్టెస్టులు ఇంగ్లీషులో కన్న హిందీలో నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.58.7శాతం మంది ఆన్లైన్ పరీక్షవైపే మొగ్గు చూపగా యూట్యూబ్ క్లాసెస్ లేదా వీడియోల ద్వారా కోచింగ్లకు 44.5శాతం మంది ఓటువేశారు. ఇక కోచింగ్ ఇన్స్ట్యూట్లకు వెళ్లి క్లాసులు వినడంపై కేవలం 8.4శాతం మంది మాత్రమే మొగ్గు చూపుతున్నట్లు సర్వే పేర్కొంది. 39.4శాతం మంది అభ్యర్థులు ఒకేసారి మూడు కాంపిటీటివ్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నట్లు తమ స్టడీలో వెల్లడైనట్లు అభిషేక్ తెలిపారు. జేఈఈ, నీట్, బ్యాంకింగ్, ఎస్ఎస్సీ, గేట్లాంటి పోటీపరీక్షలకు అభ్యర్థులు ఆన్లైన్ ద్వారానే ప్రిపేర్ అవుతున్నట్లు సర్వే వెల్లడించింది.
అంతా ఆన్లైన్ క్లాసులే...నో కోచింగ్ ఇన్స్టిట్యూట్స్
ఆన్లైన్ ద్వారా బోధనలు సంప్రదాయ కోచింగ్ క్లాసెస్కు గండికొడుతున్నాయని సర్వే వెల్లడించింది.ఇక చర్చలకు, సందేహాలను నివృత్తి చేసుకునేందుకు సోషల్ మీడియా కచ్చితంగా ఒక వేదికగా నిలుస్తోందని ఆలివ్ బోర్డు చేపట్టని సర్వేలో తేటతెల్లమైంది. ఇక సర్వే సేకరించిన డేటా ప్రకారం చర్చలకు, సందేహాల నివృత్తికి టెలిగ్రామ్ను 31.5శాతం మంది వినియోగించుకుంటుండగా... వాట్సాప్ గ్రూపులను 31.5శాతం మంది వినియోగిస్తున్నట్లు ఆలివ్ బోర్డు పేర్కొంది.