2020 నాటికల్లా భారత్లో ఉన్న ఉద్యోగస్తుల వేతనాలు పెంపు.. ఎంతో తెలుసా..?
2020 నాటికల్లా భారత్లో పనిచేసే ఉద్యోగుల వేతనాల్లో దాదాపు 9.2శాతం వృద్ధి కనిపిస్తుందని ఓ అంతర్జాతీయ సంస్థ అయిన కోర్న్ ఫెరీ గ్లోబల్ శాలరీ ఫోర్కాస్ట్ వెల్లడించింది. ఇది ఆసియాదేశాల్లో కెల్లా అతిపెద్ద పెరుగుదలగా నమోదవుతుందని ఆ సంస్థ వెల్లడించింది. అదే సమయంలో ద్రవ్యోల్బణం ఈ వేతనాలపై ప్రభావం చూపితే కనుక 5శాతం మాత్రమే పెరుగుదల కనిపించే సూచనలు ఉన్నాయని ఆ సంస్థ వెల్లడించింది.
ఆయా ఆసియా దేశాల్లో ఉద్యోగుల జీతాలపై చేపట్టిన సర్వేలో భారత్కు చెందిన ఉద్యోగులకు అత్యధిక పెరుగుదల 9.2శాతంగా నమోదై తొలిస్థానంలో నిలిచిందని కోర్న్ ఫెరీ గ్లోబల్ శాలరీ ఫోర్కాస్ట్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తుండగా భారత్కు చెందిన ఉద్యోగస్తుల జీతాల్లో మాత్రం పెరుగుదల నమోదు కావడం ఆశ్చర్యం కలిగించిందని సర్వే చేసిన సంస్థ తెలిపింది. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతున్న క్రమంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆహ్వానించదగ్గవని కోర్న్ ఫెరీ గ్లోబల్ శాలరీ ఫోర్కాస్ట్ ఇండియా ఛైర్మెన్ మరియు రీజియనల్ మేనేజింగ్ డైరెక్టర్ నవ్నీత్ సింగ్ తెలిపారు.
ఇక ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 2020 కల్లా... ఉద్యోగస్తుల జీతాలు 4.9శాతానికి పెరుగుతుందని పేర్కొంది. ప్రపంచ ద్రవ్యోల్బణ రేటు 2.8శాతంగా అంచనా వేస్తుండగా వాస్తవిక జీతాల్లో 2.1శాతం పెరుగుదల ఉంటుందని సర్వే అంచనా వేస్తోంది. ఇక ఆసియా దేశాల్లో చూస్తే ఇండోనేషియాలో వేతనాల్లో పెంపు 8.1శాతంగా ఉండగా, మలేషియా, చైనా, కొరియా దేశాల్లో జీతాల పెంపు వరుసగా 5శాతం, 6శాతం, 4.1శాతం ఉన్నట్లు సర్వే తెలిపంది. ఇక అత్యల్పంగా జపాన్లో 2శాతం పెరుగుదల ఉంటుండగా తైవాన్లో ఉద్యోగస్తుల జీతాల్లో 3.9శాతం పెరుగుదల ఉన్నట్లు చెప్పింది.
కోర్న్ ఫెరీకి సంబంధించిన డేటా బేస్ నుంచి సమాచారం తీసుకుని 20 మిలియన్ ఉద్యోగస్తులను సర్వే చేసినట్లు వెల్లడించింది. 130 దేశాల్లోని 25వేల సంస్థలకు చెందిన ఉద్యోగస్తుల ఒపీనియన్ తీసుకోవడం జరిగిందని సర్వే వెల్లడించింది.