కాగ్నిజెంట్ టెక్కీలకు షాక్: నో హైక్స్.. నో ప్రమోషన్స్.. అంటున్న కంపెనీ!
మూడు నెలల పాటు ప్రమోషన్లు, వేతనాల పెంపును నిలిపివేస్తున్నట్లు కాగ్నిజెంట్ ప్రకటించింది. వృద్ధి రేటు తగ్గడం, వ్యాపారం మందగించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.
విజయవాడ: ఒకప్పుడు ఐటీ కొలువంటే ఎగిరి గంతేసిన కుర్రాళ్లు.. ఇప్పుడు కాస్త తటపటాయించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎప్పుడూ అనిశ్చితి కుదిపిస్తేందో తెలియని రంగంలో ఉద్యోగ భద్రత వారిని కలవరపెడుతోంది. ఉన్నపలాన పింక్ స్లిప్ చేతిలో పెట్టి ఇంటికి దారిచూపిస్తే.. తమ పరిస్థితేంటి? అన్న ఆందోళనలో చాలామంది ఉన్నారు.
టెక్కీలకు షాక్ : కాగ్నిజెంట్ లో 6000 మందికి 'పింక్ స్లిప్'!?
ఓవైపు ఉద్యోగుల తొలగింపు.. మరోవైపు ప్రమోషన్ల నిలిపివేతతో ప్రస్తుతం ఐటీ జీవుల కెరీర్ గడ్డు పరిస్థితులనే ఎదుర్కొంటోంది. తాజాగా కాగ్నిజెంట్ సైతం తమ ఉద్యోగుల నెత్తిన పిడుగులాంటి వార్త ఎత్తేసింది. మూడు నెలల పాటు ప్రమోషన్లు, వేతనాల పెంపును నిలిపివేస్తున్నట్లు కాగ్నిజెంట్ ప్రకటించింది. వృద్ధి రేటు తగ్గడం, వ్యాపారం మందగించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.
వచ్చే అక్టోబర్ మాసంలో ఉద్యోగుల పనితీరును సమీక్షించిన తర్వాతే వేతనాల పెంపు ఉంటుందని పేర్కొంది. అయితే ఈ విషయంపై అధికారికంగా స్పందించేందుకు కాగ్నిజెంట్ నిరాకరించింది. కాగా, కాగ్నిజెంట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ జిమ్ లెనాక్స్ ఇటీవల ఉద్యోగులకు రాసిన లేఖ ద్వారా ప్రమోషన్లు, వేతనాల నిలిపివేత విషయం స్పష్టమైంది.
"గడిచిన సంవత్సరాల్లో మాదిరే.. ఈ ఏడాది కూడా బేసిక్ వేతనాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. సీనియర్ ఉద్యోగులకు పనితీరు ఆధారంగా, ఒకేసారి ప్రోత్సాహక నగదును అందిస్తాం" అని లేఖలో ఆయన పేర్కొన్నారు. పంచవ్యాప్తంగా కాగ్నిజంట్ లో 2,61,200 మంది ఉద్యోగులు పని చేస్తుండటంతో.. ఈ ప్రభావం వారిపై పడనుంది.