ఇక 'పీఎఫ్' పొందాలంటే కనీస వేతనం రూ.25వేలు ఉండాల్సిందే!..
కొత్త నిబంధనల మేరకు కనీసం రూ.25వేల జీతం ఉన్న ఉద్యోగులకే పీఎఫ్ వర్తింపజేయాలని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) యోచిస్తోంది.
న్యూఢిల్లీ: ఉద్యోగ విరమణ తర్వాత విశ్రాంత జీవితానికి భరోసానిచ్చేలా 'పీఎఫ్'(ప్రావిడెంట్ ఫండ్) పథకం ఎప్పటినుంచో అమలులో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వం ఇందులో కొత్త నిబంధనలు ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.
కొత్త నిబంధనల మేరకు కనీసం రూ.25వేల జీతం ఉన్న ఉద్యోగులకే పీఎఫ్ వర్తింపజేయాలని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) యోచిస్తోంది. వచ్చే నెలలో జరగనున్న ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సమావేశంలో ఈ ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోనుంది.
ధరల పెరుగుదల, వేతన సమీక్షలో భాగంగా ఈపీఎఫ్ఓ ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. దీంతో పీఎఫ్ వర్తించడానికి ఇప్పటివరకు రూ.15వేలుగా ఉన్న కనీస వేతన పరిమితి, రాబోయే రోజుల్లో రూ.25వేలకు పెరగనుంది. కేంద్రంమ మాత్రం ఈ పరిమితిని రూ.21వేలుగా నిర్ణయించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, సెప్టెంబర్ 1, 2014వరకు పీఎఫ్ వేతన సీలింగ్ రూ.6,500గా ఉంది. అప్పటి నిబంధనలను సవరించి దాన్ని రూ.15వేలకు పొడగించారు. ఇదిలా ఉంటే, సంఘటిత రంగంలో ఉన్న 60లక్షల పైచిలుకు ఉద్యోగులను తమ సోషల్ సెక్యూరిటీ పరిధిలోకి చేర్చుకోవాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. సంఘటిత రంగంలో ఇప్పటివరకు 4కోట్ల మంది ఉద్యోగులు ఈపీఎఫ్ఓలో ఖాతాదారులుగా ఉన్నారు.