పాక్కు మద్దతు: చైనాకు షాక్ ఇస్తున్న ఇండియా
న్యూఢిల్లీ: పాకిస్తాన్కు మద్దతు ఇస్తూ భారత్ను కష్టాల్లోకి నెట్టాలని ప్రయత్నిస్తున్న చైనాకు భారతీయులు షాక్ ఇస్తున్నారు. దీపావలి సందర్బంగా చైనా తయారీ బాణసంచాతో పాటు ఇతర చైనా ఉత్పత్తులను బహిష్కరించాలనే పిలుపునకు భారతదేశంలో ఎక్కడ లేని మద్దతు లభిస్తోంది.చైనా తయారు చేసిన వస్తువులను కొనకుండా నిరసన తెలియజేస్తున్నారు.
చెైనా ఉత్పత్తుల అమ్మకాలు 40 శాతం పడిపోయినట్లు ఓ అంచనా. ఎల్సిడి టీవీల కొనుగోళ్లు 15 శాతం పడిపోయాయి. చైనా మొబైల్ ఫోన్లతో పాటు ఎలక్ట్రానిక్ గూడ్స్ సేల్స్ కూడా విపరీతంగా పడిపోయాయి. దీపావళి సందర్భంగా చైనా ఉత్పత్తులను కొనరాదంటూ కొన్ని సంస్థలిచ్చిన పిలుపునకు భారీ మద్దతు లభిస్తోంది.
భారతీయులు స్వదేశీ వస్తువులనే కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. చైనా ఉత్పత్తులకు వ్యతిరేకంగా భారతీయుల్లో ఇంతటి మార్పు ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి అని అంటున్నారు. యూరీ దాడి తర్వాత కూడా పాకిస్థాన్ను వెనకేసుకొస్తున్న చైనాకు బుద్ధి చెప్పాలని కొన్ని సంస్థలు పిలుపునిచ్చాయి. మసూద్ అజహర్ లాంటి ఉగ్రవాదిపై నిషేధం పడకుండా కాపాడుకుంటూ వస్తున్న చైనాకు బుద్ధి చెప్పడానికి అనూహ్యమైన మద్దతు లభిస్తోందని అంటున్నారు.
చైనా తయారీ డెకరేటివ్ లైట్లు, విగ్రహాల అమ్మకాలు కూడా పడిపోయాయాని వ్యాపారులు అంటున్నారు. స్వదేశీ ఉత్పత్తుల ధరలు చైనా ఉత్పత్తులతో పోల్చితే ఎక్కువ ధర అయినా భారతీయులు భారతీయ ఉత్పత్తులనే కొంటున్నారని వెల్లడించారు.
వాస్తవానికి చైనా తయారీ వస్తువుల బహిష్కరణ ఉద్యమం సోషల్ మీడియాలో బాగా ప్రచారమైంది. దాని ప్రభావమే చైనా ఉత్పత్తుల అమ్మకాలు పడిపోవడానికి కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.