బుల్లెట్లు దూసుకొస్తున్నా.. ఏడుగురి ప్రాణాలు కాపాడలేకపోయినా..: ఆ డ్రైవర్ 'రియల్' హీరో
అమర్నాథ్ యాత్రలో ఉగ్రదాడి సమయంలో ఓ బస్సు డ్రైవర్ భక్తుల ప్రాణాలను కాపాడాడు. ఉగ్రదాడిలోఏడుగురి ప్రాణాలు పోయాయి. బస్సు డ్రైవర్ తన చాకచక్యంతో వ్యవహరించి మరికొందరి ప్రాణాలు పోకుండా కాపాడాడు.
శ్రీనగర్: అమర్నాథ్ యాత్రలో ఉగ్రదాడి సమయంలో ఓ బస్సు డ్రైవర్ భక్తుల ప్రాణాలను కాపాడాడు. ఉగ్రదాడిలోఏడుగురి ప్రాణాలు పోయాయి. బస్సు డ్రైవర్ తన చాకచక్యంతో వ్యవహరించి మరికొందరి ప్రాణాలు పోకుండా కాపాడాడు.
అమర్నాథ్ టెర్రర్ అటాక్పై కేంద్రం సీరియస్, దాడి వెనుక అతనే!
ఆ డ్రైవర్ పేరు సలీమ్. ఉగ్రవాద దాడి జరిగితే ఎవరైనా భయాందోళనకు గురవుతారు. అలాంటి సమయంలోను ఆ డ్రైవర్ ప్రయాణీకుల ప్రాణాలు కాపాడి, రియల్ హీరోగా నిలిచాడు.
ఉగ్రవాదుల బుల్లెట్ల వర్షం కురుస్తున్నప్పటికీ సలీమ్ బస్సును వేగంగా పోనిచ్చాడు. తాను బస్సును నిలిపితే మరింత ప్రాణనష్టం జరుగుతుందని అతను భావించాడు. అందుకే బస్సును ఆపకుండా, వేగం పెంచి మరికొందరి ప్రాణాలు కాపాడాడు.
తామంతా బస్సులో ఉన్నామని, బయట అంతా చీకటిగా ఉందని, అంతలో ఒక్కసారిగా కాల్పుల శబ్దాలు వచ్చాయని, బస్సు పైకి బులెట్ల దూసుకొస్తున్నాయని, అయినా సరే డ్రైవర్ బస్సును ఆపకుండా కిలో మీటర్ దూరం తీసుకు వెళ్లాడని ఈ ఘటనలో గాయపడిన మహారాష్ట్రకు చెందిన ఓ భక్తురాలు తెలిపారు.
వన్ ఇండియాతో కాశ్మీర్ ఐజీ
'వన్ ఇండియా'తో కాశ్మీర్ ఐజీ మునీర్ ఖాన్ మాట్లాడారు. తాను పలువురు ప్రయాణీకులతో మాట్లాడానని, అందరు కూడా బస్సు డ్రైవర్ పైన ప్రశంసలు కురిపించారని, ఓ వైపు కాల్పులు జరుగుతున్నా అతను బస్సును వేగంగా పోనిచ్చాడని, మిగతా ప్రయాణీకులను భద్రంగా తీసుకు వచ్చాడని, పలువురి ప్రాణాలు కాపాడాడని ఐజీ మునీర్ ఖాన్ తెలిపారు.
థ్యాంక్స్ చెప్తే సరిపోదు
ఆ బస్సు డ్రైవర్కు కేవలం ధన్యవాదాలు చెబితే సరిపోదని ఓ భక్తుడు అన్నారు. ఆ సమయంలో తాము నిద్రలో ఉన్నామని, బుల్లెట్ల శబ్దం విని నిద్ర లేచామని, ఆ సమయంలో డ్రైవర్ బస్సును అలాగే పోనిచ్చి, తమను రక్షించాడని చెప్పారు.
ఏడుగురి ప్రాణాలు కాపాడలేకపోవచ్చు కానీ
మరోవైపు, బస్సు డ్రైవర్ సలీమ్ బంధువు జావెద్ గుజరాత్లో మీడియాతో మాట్లాడారు. సలీమ్ ఏడుగురు ప్రాణాలను కాపాడలేకపోవచ్చనని, కానీ 50 మందిని సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారని, ఆయనను చూస్తే గర్వంగా ఉందని చెప్పారు. 9.30 గంటల ప్రాంతంలో ఆయన తనకు ఫోన్ చేసి దాడి గురించి చెప్పారని, యాత్రికులను రక్షించడం కోసమే బస్సును అక్కడ ఆపలేదని సలీమ్ తనకు ఫోన్లో చెప్పాడని జావెద్ అన్నారు.
ముష్కరుల ఘాతుకం
జమ్ము కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో సోమవారం రాత్రి అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. తొలుత సాయుధ కారుపై దాడి చేసిన ముష్కరులు.. ఆ తర్వాత విచక్షణ కోల్పోయి యాత్రికుల బస్సుపై కాల్పులు జరుపుతూ పరారయ్యారు. యాత్రికులు అమర్నాథ్ గుహలోని మంచు శివలింగాన్ని సందర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా.. ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.