తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు సల్మాన్ కారు డ్రైవర్పై కేసు నమోదు: జడ్జి
ముంబై: 'హిట్ అండ్ రన్' కేసులో బాలీవుడ్ సల్మాన్ ఖాన్ను కోర్టు దోషిగా నిర్ధారించిన కోర్టు ఐదేళ్ల జైలు శిక్షను విధించిన సంగతి తెలిసిందే. శిక్ష తగ్గించమని సల్మాన్ ఖాన్ వాదనను తోసిపుచ్చిన శిక్షను విధించిన న్యాయమూర్తి, ఈ కేసులో చెప్పిన తప్పుడు సాక్ష్యాలపై చర్యలకు ఉపక్రమించారు.
2002లో జరిగిన ఈ ఘటనలో ప్రమాదం జరిగిన సమయంలో సల్మాన్ ఖాన్ కారు నడపలేదని, తానే కారును నడిపానంటూ కోర్టు ముందుకు వచ్చి తప్పుడు సాక్ష్యం చెప్పిన సల్మాన్ ఖాన్ డ్రైవర్పై కేసు నమోదు చేయాలని న్యాయమూర్తి దేశ్ పాండే ఆదేశాలు జారీ చేశారు.
సల్మాన్ను రక్షించేందుకు గాను కారు డ్రైవర్ తప్పుడు సాక్ష్యం చెప్పాడని నిర్ధారించిన కోర్టు, అతడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని పోలీసులకు సూచించింది. 13 సంవత్సరాలుగా వస్తున్న ఈ కేసు విచారణ తుది దశలో ఉన్నప్పుడు కారు డ్రైవర్ అబద్ధపు సాక్ష్యం చెప్పి కోర్టును తప్పదోవ పట్టించేందుకు యత్నించాడని న్యాయమూర్తి దేశ్ పాండే ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కేసులో 2002లో తాను కారు నడపలేదని మేరియట్ హోటల్ నుంచి తన నివాసానికి వెళ్లే సమయంలో వెనుక సీట్లో ఉన్నానని, డ్రైవరే కారు నడుపుతున్నాడని సల్మాన్ వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే. బాంద్రాలోని ఓ బేకరీపైకి కారు దూసుకెళ్లడంతో పేవ్మెంట్పై పడుకున్న ఒకరు మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ కేసులో డ్రైవర్దే తప్పు అని తనది కాదని సల్మాన్ కోర్టులో వాదించారు. కారు డ్రైవర్ సైతం చివరి క్షణంలో అప్రూవర్గా మారి తానే డ్రైవింగ్ చేశానని తప్పు ఒప్పుకుంటున్నానని కోర్టుకు విన్నవించాడు కూడా. అయితే న్యాయమూర్తి దేశ్ పాండే అటు సల్మాన్ వాదనను గానీ, ఇటు డ్రైవర్ని ఒప్పుకోలుని పరిగణనలోకి తీసుకోకుండా సల్మాన్ను దోషిగా నిర్ధారించి, శిక్ష ఖరారు చేశారు.