రాజపక్సే తరుపున సల్మాన్ ప్రచారం... సిగ్గుచేటు: సీపీఐ
న్యూఢిల్లీ: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో ఆ దేశ అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సే తరుపున బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ప్రచారం చేయడంపై తమిళ పార్టీలు తీవ్ర స్ధాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ వివాదంపై సీపీఐ జాతీయ సెక్రటరీ డి. రాజా స్పందించారు.
పాఠకుల కోసం ఫేస్బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
"మానవ హక్కులు పరిరక్షించడంలో ఎప్పుడూ నటులు ముందువరుసలో ఉంటారు. కానీ ఓ సామూహిక హత్యాకాండలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తరపున ప్రచారం చేయడం భారతీయ నటుడుకి నిజంగా సిగ్గుచేటు, తీవ్రమైంది" అని సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి డి. రాజా అన్నారు. మారణకాండ గురించి రాజపక్సను చరిత్ర ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటుందని అన్నారు.
శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సేకు... ప్రధాని నరేంద్రమోడీకి చెందిన సోషల్ మీడియా క్యాంపెనర్ సహాయం చేయడాన్ని కూడా తీవ్రంగా విమర్శించారు. దీనిని బట్టి చూస్తుంటే రాజపక్సేకు మోడీ మద్దతుగా నిలిచినట్లు తెలుస్తోంది. శ్రీలంక ఆర్మీ అమాయకులైన శ్రీలంక తమిళులపై చేసిన యుద్ధ నేరాలపై విచారణ జరిపించాల్సిందిగా ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ బాకీ మూన్ కోరిన విషయాన్నిప్రస్తావించారు.
ఇక శ్రీలంక అధ్యక్షుడు మహీంద్ర రాజపక్సేకు ఎన్నికల్లో ప్రచారం చేయాలని నిర్ణయించిన సల్మాన్ ఎండీఎంకే, డీఎంకే తప్పుబట్టిన విషయం తెలిసిందే. డీఎంకే పార్టీ అధికార ప్రతినిధి ఇళంగోవన్ మాట్లాడుతూ.. భారత ఫిషర్ మెన్ పైన శ్రీలంక నావీ దాడులు చేస్తోందని గుర్తు చేశారు.
ఇలాంటి సమయంలో సల్మాన్ ఖాన్ శ్రీలంకకు వెళ్లి రాజపక్స తరఫున ప్రచారం చేయడం సరికాదన్నారు. ఇది కేవలం తమిళనాడుకు సంబంధించిన విషయం కాదని, భారత్కు సంబంధించిందన్నారు. రాజపక్శకు ప్రచారం చేయడం ద్వారా సల్మాన్ ఖాన్ భారత్ ఫిషర్ మెన్ను పరిగణలోకి తీసుకోలేదని అర్థమవుతోందన్నారు. ఇది తీవ్రంగా ఖండించదగ్గ విషయమన్నారు.
సల్మాన్ నిర్ణయాన్ని ఎండీఎంకే వ్యవస్థాపకుడు వైగో కూడా ఖండించారు. సల్మాన్ను ద్రోహిగా అభివర్ణించారు. శ్రీలంక నుంచి అతనిని తరిమి కొట్టాలని అక్కడి తమిళులకు ఆయన పిలుపునిచ్చారు.