మీడియాపై అదేం మాట: కెసిఆర్ వ్యాఖ్యలపై ఖుర్షీద్
న్యూఢిల్లీ: మీడియాను భూమిలో పాతివేస్తానంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సల్మాన్ ఖుర్షీద్ ఖండించారు. బుధవారం ఏఐసిసి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వచ్చిన ప్రశ్నపై ఆయన ఆ విధంగా అన్నారు.
ప్రజాస్వామ్యంలో అంతర్భాగమైన మీడియాను ఇలా పాతేస్తామనటం ఎంతమాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేశారు. రాజకీయ నాయకులకు మీడియాతో భేదాభిప్రాయాలు ఉండవచ్చని, అంతమాత్రాన పాతేస్తామని ఎలా బెదిరిస్తారని ఆయన ప్రశ్నించారు.
మీడియా మన గురించి బాగా రాస్తేనే మంచిగా ఉంటామని, లేకపోతే అందుకు భిన్నంగా ఉంటామనటం పద్ధతి కాదన్నారు. మీడియా తన విధులను నిర్వహిస్తోంది కాబట్టి రాజకీయ నాయకులు మీడియాతో స్నేహంగా ఉండాలని సల్మాన్ ఖుర్షీద్ సూచించారు.
వరంగల్ కాళోజీ శతజయంతి కార్యక్రమంలో మీడియాపై కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ఈ స్థితిలో ఆయన వ్యాఖ్యలపై అన్ని పార్టీల నాయకులు ప్రతిస్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది.